పాట్నా: బీహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్కే సింఘాల్ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా కొనసాగించడంపై రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ..నోటీసులు జారీ చేసింది. డీజీపీగా సింఘాల్ నియామకం అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన సీనియార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బొపన్న, హిమా కోహ్లీ ధర్మాసనం..1988 ఐపీఎస్ బ్యాచ్ అధికారి సింఘాల్కు నోటీసులు జారీ చేసింది. అదేసమయంలో యూపీఎస్సీ నుంచి వివరణ కోరింది. 2020లో డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోగా.. సింఘాల్కు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. తదుపరి విధి విధానాలు అనుసరించకుండా ఆయన్ను డీజీపీగా నియమించింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఒక రాష్ట్రానికి డీజీపీని నియమించాలంటే సర్వీసు, మంచి రికార్డు, పోలీసు ఫోర్స్కు నాయకత్వం వహించిన అనుభవం ఆధారంగా ముగ్గురు ఉన్నతాధికారుల్లో ఒకరిని నియమించాలని పేర్కొంది. అందుకు యూపీఎస్సీ పేర్లను ఆమోదించాల్సి ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైన తర్వాత, అధికారి పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా కనీసం రెండేళ్ల పదవీకాలం ఉండాలి.