సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : వాహన మిత్ర పేరుతో ఆటో, టాక్సీ డ్రైవర్లకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గోరంత ఇచ్చి, కొండంత దోచేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 లక్షలకు పైగా ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. వీరిలో కేవలం 2.61 లక్షల మందికి మాత్రమే వాహన మిత్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 100 గజాల ఇల్లు ఉంటే వాహన మిత్ర వర్తించదని, ఒక ఇంట్లో ఇద్దరు డ్రైవర్లకు వర్తించబోదని తదితర కుంటి సాకులు చెబుతూ మిగిలిన 6.4 లక్షల మంది డ్రైవర్లకు మొండి చేయి చూపింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానానికి చేరింది. ఇతర రాష్ట్రాల కన్నా లీటరుకు రూ.10కి పైగా పెట్రో ధరలు ఏపీలో ఉన్నాయి. ఏపీలో పెట్రోల్ ధరలు రవాణా, తదితర రంగాలపై వేస్తున్న అదనపు భారాలు ప్రజలపై పడుతున్నాయి. పెట్రో ధరలను తగ్గించడంలో జగన్ సర్కార్ ఏమాత్రం స్పందించకపోవడం దుర్మార్గం. వాహన మిత్ర పేరుతో రూ.10 వేలు ఇస్తూ, పెట్రోల్, డీజిల్ సుంకాలు విపరీతంగా పెంచి, ఒక్కో ఆటో డ్రైవర్ నుంచి ఏడాదికి దాదాపు రూ.20 వేలు రాష్ట్ర ప్రభుత్వం దోచేస్తున్నది. అంతేకాకుండా గతంలో రూ.2 వేలుగా ఉన్న ఆటో, టాక్సీ పర్మిట్ ఇప్పుడు రూ.10 వేలకు పెంచారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్స్ ఫీజు రూ.1,500 నుంచి రూ.5 వేలకు పెంచారు. ఎఫ్సి చలానా, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, పర్మినెంటు చలానా, గ్రీన్ ట్యాక్స్ వంటివి వాహన శ్రేణిని బట్టి కట్టాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులు, రవాణా శాఖ అధికారులకు నెలవారీ కోటాలు వేసి, ఆటో, టాక్సీ, టాటా మ్యాజిక్ తదితర వాహనాలకు విపరీతమైన కేసులు రాయిస్తూ, అధిక జరిమానాలు విధించి డ్రైవర్ల నడ్డి విరుస్తున్నది. మరోవైపు రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వాన స్థితికి చేరాయి. గోతులు, గుంతల మయంగా మారాయి. రాష్ట్రంలో గుంతల రోడ్లపై నడుస్తున్న వాహనాలు పదేపదే మరమ్మతులకు గురవుతున్నాయి. వాహనదారుల నుంచి రోడ్ ట్యాక్స్, సెస్ పేరుతో వసూలు చేస్తున్న పన్నులు ఏమైపోతున్నాయో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. ఇలా మొత్తం మీద ఒక్కో ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవర్ ఏడాదికి రూ.40 నుంచి 50 వేల వరకు వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించుకోక తప్పడం లేదు. వాహన మిత్ర పేరుతో కేవలం 2.61 లక్షల మందికి రూ.10 వేలు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి పెట్రో ధరలు, అధిక పన్నులు, జరిమానాల రూపంలో ఏడాదికి ఒక్కో డ్రైవర్ నుంచి రూ.50 వేల వరకు నిలువు దోపిడీ చేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు.