Friday, April 26, 2024
Friday, April 26, 2024

విశాఖలో మంకీ పాక్స్‌ కలకలం.. ఎంబీబీఎస్‌ విద్యార్థికి లక్షణాలు!

విశాఖలో మంకీ పాక్స్‌ కలకలంరేపింది. ఒక ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థికి మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలున్నట్లు తెలుస్తోంది. వెంటనే ఆరోగ్యశాఖ యంత్రాంగం అప్రమత్తమై.. విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లారు. ఆ విద్యార్థి కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఒంటిపై, చేతివేళ్లపై దద్దుర్లు వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారట. ఇవి మంకీపాక్స్‌ లక్షణాల్లా కనిపించడంతో మెడికల్‌ కాలేజీ అధికారులు శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ విజయలక్ష్మి రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను ఆ మెడికల్‌ కాలేజీకి పంపాలని సూచించారు. వారు వెంటనే యువకుడిని పరిశీలించి నమూనాలు సేకరించేందుకు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ (జనరల్‌ ఫిజీషియన్‌, డెర్మటాలజిస్ట్‌, మైక్రో బయాలజిస్ట్‌, మరో వైద్యుడు, ఇద్దరు సాంకేతిక సిబ్బంది)ను నియమించి మెడికల్‌ కాలేజీకి పంపించారు. కానీ ఐసోలేషన్‌ వార్డులో యువకుడు లేకపోవడంతో అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి అధికారులు స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించినట్టు తెలుస్తోంది. యువకుడికి కేవలం లక్షణాలే ఉన్నాయని.. తాము అప్రమత్తంగా ఉన్నామని వైద్యశాఖ అధికారులు అంటున్నారు. అధికారులు ఆ విద్యార్థి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు శనివారం హైదరాబాద్‌ నుంచి విశాఖ చేరుకునే అవకాశం ఉంది. ఆ విద్యార్థిని కలిసినవారి వివరాలను అధికారులు అడిగి తెలుసుకునే పనిలో ఉన్నారు. విద్యార్థి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలకు వెళ్లి వచ్చాడు. అప్పటినుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img