కర్ణాటకలో తలెత్తిన హిజాబ్ వివాదం అమాయక విద్యార్థుల మధ్య విషపు గోడగా నిలుస్తోందని మక్కల్ నీది మయ్యం చీఫ్, నటుడు కమల్ హాసన్ అన్నారు. ‘కర్ణాటకలో జరుగుతోన్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. ఈ వివాదం మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మారుతోంది. ఈ పరిస్థితులు తమిళనాడుకు పాకకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సహా అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా.’అని కమల్ ట్వీట్ చేశారు.కాగా, హిజాబ్ ధరించడం తమ ప్రాథమిక హక్కుగా ప్రకటించాలని కోరుతూ కర్ణాటకలో ముస్లిం విద్యార్థినులు హైకోర్టులో వేసిన పిటిషన్పై ఏకసభ్య ధర్మాసనం బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ కొనసాగించనుంది. ప్రజలందరూ శాంతిభద్రతలు కాపాడాలని కర్ణాటక హైకోర్టు సైతం కోరింది. అన్ని పాఠశాలలు, కళాశాలలకు కర్ణాటక ప్రభుత్వం మూడు రోజులు సెలవులు ప్రకటించింది.