కాంగ్రెస్ నేత సుబోధ్ కాంత్ తీవ్ర వ్యాఖ్యలు
న్యూదిల్లీ: ప్రధాని మోదీ ఒకవేళ హిట్లర్ మార్గంలో వెళ్తే… హిట్లర్ చావే చస్తారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం జంతమంతర్ వద్ద పార్టీ నిర్వహించిన సత్య్గాగ్రహ నిరసన కార్యక్రమంలో అగ్నిపథ్ పథకంపై విమర్శలు చేస్తూ.. సహాయ్, ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ పూర్తిగా నియంతగా మారిపోయినట్టు, హిట్లర్ చరిత్రను మోదీ మళ్లీ పునరావృతం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నదని పేర్కొన్నారు. హిట్లర్ కూడా ఒక సంస్థ ఏర్పాటు చేశాడని, దాని పేరు ఖాకీ అని ఉండేదని చెప్పారు. ఒక వేళ మోదీ కూడా హిట్లర్ ఆలోచనల్లోనే నడిస్తే… ఆయన కూడా హిట్లర్ చావే చస్తాడని కొత్త వివాదానికి తెరతీశారు. కాగా, కాంగ్రెస్ నేత సుభోద్ కాంత్ సహాయ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా ఎన్సీపీ నేత మజీద్ మెమన్ వీటిపై స్పందించబోనని పేర్కొన్నట్టు టైమ్స్ నౌ సంస్థ కథనాన్ని ప్రచురించింది. ప్రతి ఒక్క రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించాలని అనుకోవడం లేదని, అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలని చెప్పారు. కాగా, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ప్రతినిధి షెహెజాద పూనావాలా కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఒక్కో నేత ఒక్కోలా పేలుతుంటే, కాంగ్రెస్ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల సూచనల మేరకే వీరు ఇల్లా మాట్లాడుతుంటారని ఆరోపించారు.