అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన నోయిడా జంట భవనాల కూల్చివేత ప్రక్రియ పూర్తయ్యింది. అనుకున్న సమయానికి సరిగ్గా మధ్యాహ్నం 2.30 గంటలకు ట్విన్ టవర్స్ను కూల్చివేశారు. కేవలం 9 సెకన్లలోనే పూర్తిగా కుప్పకూలింది. దీనికోసం రెండు రోజుల నుంచి కసరత్తు జరిగింది. ఈ టవర్స్ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. దీంతో 9 సెకన్లలోపే భారీ శబ్ధాలతో భవనాలు నేలమట్టం అయ్యాయి. దీనికోసం వాటర్ పాల్ టెక్నిక్ను ఉపయోగించారు. ఓ బటన్ నొక్కగానే బిల్డింగ్ కుప్పకూలిపోయే విధంగా వాటిని ఏర్పాటు చేశారు. ఈ బిల్డింగ్ కట్టడానికి రూ.70 కోట్లు ఖర్చైతే.. కూల్చడానికి రూ.20 కోట్లు ఖర్చు అయింది.
రెండు సంస్థల ఆధ్వర్యంలో…
ఈ అతిపెద్ద భవనాలను ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ, దక్షిణాఫ్రికాకు చెందిన జెట్ డిమాలిషన్స్ సంస్థ కలపి కూల్చివేశాయి. గతంలో ఎడిఫెస్ ఇంజనీరింగ్ సంస్థ తెలంగాణ సచివాలయం, సెంట్రల్ జైలును, గుజరాత్ రాష్ట్రంలోని పాత మొతెరా స్టేడియంలను కూల్చివేసింది. ఈ సంస్థలు కేరళలో కూడా పలు భవనాలను కూల్చివేశాయి.
సురక్షిత ప్రాంతాలకు 7000 మంది…
నిర్మాణాల కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగక్కుండా అధికారులు ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దాదాపు 500 మంది పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది మోహరించారు. ట్విన్ టవర్స్ చుట్టుపక్కల ఉన్న స్థానికులను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. దాదాపుగా 7000 మందిని ఖాళీ చేయించారు. వారిని ఉదయం 8 గంటలకే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తిరిగి వారు సాయంత్రం 5 గంటల తర్వాత వారు వారి నివాసాలకు చేరుకునే అవకాశం ఉంది. అదే విధంగా ఆ దారిలో వచ్చే వాహనాలను మళ్లించారు. ఆ చుట్టు పక్కల ఉన్న భవనాలను ఎటువంటి నష్టం జరగక్కుండా చర్యలు తీసుకున్నారు.
గ్యాస్, విద్యుత్ నిలిపేశారు…
అలాగే కూల్చివేతల పరిసర ప్రాంతాల్లోని హౌసింగ్ సొసైటీలో అండర్ గ్రౌండ్ గ్యాస్, విద్యుత్ నిలిపివేశారు. ట్విన్ టవర్స్ వద్ద నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేయడంతో పాటు చుట్టుపక్కల 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. కూల్చివేత పూర్తైనంత వరనకూ ఆ ప్రదేశంలోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ప్రత్యేక డస్ట్ మిషన్ ఏర్పాటు…
అలాగే కూల్చివేసిన తర్వాత దుమ్ము, కాలుష్య స్థాయిలను పర్యవేక్షించడానికి ప్రత్యేక డస్ట్ మిషన్ను ఏర్పాటు చేశారు. బిల్డింగ్ కూలిన కొద్ది నిమిషాల్లోనే గాలిలో దుమ్ము, దూళిని క్లియర్ చేయనున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలోని వీధి కుక్కలకు ఎలాంటి ప్రమాదం జరగక్కుండా ఉండేందుకు ఎన్జీవో సంస్థలు రంగంలోకి దిగాయి.
తొమ్మిదేళ్ల న్యాయ పోరాటం..
నోయిడాలోని సెక్టార్ 93ఏలో ఉన్న ఈ జంట భవనాలను నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించారు. దీనిపై దగ్గర్లోని సూపర్టెక్ ఎమరాల్డ్ కోర్టు సొసైటీ వాళ్లు 2012లో కోర్టును ఆశ్రయించారు. దాదాపు 9 ఏళ్లపాటు న్యాయపోరాటం కొనసాగించారు. తొలుత ఈ ప్రాంతంలో గార్డెన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని వాదించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు నిర్మాణ అనుమతుల్లో అవకతవకలు జరిగినట్లు తేల్చింది. భవనాల్ని కూల్చివేయాలని 2014లో ఆదేశించింది. తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించింది. కూల్చివేతకు మూడు నెలల సమయం ఇచ్చింది. కానీ సాంకేతికత కారణాల వల్ల ఏడాది సమయం పట్టింది.