పేదలు, రైతుల భూములను అక్రమ జీఓ ద్వారా దోచుకోవడం ఏంటని? టీడీపీ నేత బొండా ఉమా ధ్వజమెత్తారు. ఇలా వెయ్యి ఎకరాల భూములు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. తక్కువ ధరకు భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ఎన్ఓసీలు ఇప్పటికిప్పుడే ఎలా వచ్చాయో తేలాలి? అని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సిట్ వేసి విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కుంభకోణంపై హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా స్కామ్ జరిగితే ఎన్నికల సంఘం మౌనం వహించడం ఎందుకని? ఆయన ప్రశ్నించారు. రైతుల మెడపై కత్తిపెట్టి అగ్రిమెంట్లు చేయించుకుంటారా? అంటూ దుయ్యబట్టారు. సీఎస్ ఆధ్వర్యంలో వైసీపీ మాఫియా ఇదంతా చేసిందని ఆరోపించారు. ఈసీకి ఫిర్యాదు చేసిన ఫలితం లేదని బొండా ఉమా వాపోయారు.