500 మంది పోలీసుల మోహరింపు
మాచర్లలోనూ కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘర్షణలు ఇంకా కొనసాగుతుండడంతో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని కొలిక్కి తెచ్చేందుకు దాదాపు 500 మంది పోలీసులను మోహరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను గృహ నిర్బంధం చేయడంతో ఏం జరుగుతుందో తెలియక అయోమయం నెలకొంది. నిడిజువ్విలో వైసీపీ అభ్యర్థి సుధీర్రెడ్డిని, దేవగుడిలో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని, కడపలో టీడీపీ అభ్యర్థి భూపేశ్రెడ్డిని గృహనిర్భంధం చేశారు. అయితే, జమ్మలమడుగులో కవ్వింపు చర్యలపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సీరియస్ అయ్యారు. ఉదయం 4 గంటల వరకు జమ్మలమడుగులో మఖం వేసిన ఎస్పీ.. పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి త్రీ ప్లస్ త్రీ గన్మెన్ సౌకర్యం కల్పించారు.. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి, కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి త్రీ ప్లస్ త్రీ గన్మెన్ లను కేటాయించారు.
మరోవైపు పల్నాడు జిల్లా మాచర్లలోనూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పోలీసులు అడుగడుగునా మోహరించి పట్టణంలోకి వచ్చే వారి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు.