ఇద్దరు కార్మికుల మృతి
అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం
విశాలాంధ్ర బ్యూరో – అనకాపల్లి(రాంబిల్లి): అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో గల సాహితి ఫార్మా కంపెనీలో శుక్రవారం ఉదయం రెండు రియాక్టర్లు పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. మంటలు పూర్తిస్థాయిలో వ్యాపించి సమీప ప్రాంతాన్ని పొగతో కప్పేసింది. దీంతో కంపెనీలో ఉన్న 35 మంది కార్మికులు, సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు అవసరమైన వైద్యసేవలు అందిస్తామని తెలిపింది. ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కొన్ని గంటల వరకు మంటలు అదుపులోకి రాలేదు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అధికారులు కంపెనీ లోపలికి వెళ్లి చూడగా రమేశ్ (భువనేశ్వర్), సత్తిబాబు (జంగాలపాలెం), నూకినాయుడు (పంచదార్ల), తిరుపతి (విజయనగరం), ఎస్.రాజబాబు (రేబాక), ఎస్. అప్పారావు(నక్కపల్లి), పి.సంతోశ్కుమార్ (కొండకొప్పాక) తీవ్ర గాయాలతో పడి ఉన్నారు. వారిని చికిత్స కోసం విశాఖ ఆసుపత్రులకు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ సత్తిబాబు, తిరుపతి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ రవి పట్టన్శెట్టి, ఎస్పీ కేవీ మురళీకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ప్రమాద సమయంలో కంపెనీలో 35 మంది కార్మికులు పనిచేస్తున్నారని
తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కన్నబాబురాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు, టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు తదితరులు ఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు.
బాధ్యులపై కఠిన చర్యలు: మంత్రి అమర్నాథ్
విశాలాంధ్రబ్యూరో-విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కేజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శుక్రవారం సాయంత్రం అమర్నాథ్ పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ సాహితీ ఫార్మా కంపెనీలో ఉదయం షిఫ్ట్లో 35 మంది పనిచేస్తున్నారని, కంటైనర్లో సాల్వెంట్ లోడ్ చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయని చెప్పారు. ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా నలుగురిని కిమ్స్ ఆస్పత్రికి, ఇద్దరిని కేజీహెచ్కి, ఒకరిని అచ్యుతాపురం ఆసుపత్రికి తరలించినట్లు మంత్రి పేర్కొన్నారు. దుర్ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పారు. ప్రమాదానికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రమాదంలో జంగాలపాలేనికి చెందిన పైలా సత్తిబాబుకు 95 శాతం గాయాలు కావడంతో అతడు మరణించాడని, విజయనగరం జిల్లాకు చెందిన ఉప్పాడ తిరుపతికి ఊపిరితిత్తులు దెబ్బతిని చనిపోయాడని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చొప్పున సీఎం జగన్ ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే తరచూ ప్రమాదాలు: ఓబులేసు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో గల సాహితి ఫార్మా కంపెనీలో శుక్రవారం ఉదయం రెండు రియాక్టర్లు పేలడంతో సంభవించిన భారీ ప్రమాదం ఇద్దరు కార్మికులు మరణించడంపై ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు విచారం వ్యక్తంచేశారు. విశాఖ చుట్టుపక్కల పారిశ్రామికవాడల్లో ఈ విధమైన ప్రమాదాలు జరగడం, కార్మికులు ప్రాణాలు కోల్పోవడం సర్వసాధారణమైపోయిందన్నారు. తరుచూ ఈ విధమైన ప్రమాదాలు జరుగుతున్నా పరిశ్రమల శాఖాధికారులుగానీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్గానీ పట్టించుకోవడంలేదని విమర్శించారు. పరిశ్రమల శాఖ మంత్రి డబ్బు సంపాదన, కమీషన్లు దండుకోవడంపైనే దృష్టి పెడుతున్నారు తప్ప ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ఓబులేసు విమర్శించారు. ప్రమాదానికి కారణమైన యాజమాన్యం, ఇతరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబానికి రూ. 50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలనీ, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనీ, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఓబులేసు డిమాండ్ చేశారు.