దిల్లీ మంత్రి అతిశి ఆందోళన
ఈడీ ఆరోపణలకు కౌంటర్
న్యూదిల్లీ : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం కావాలనే మామిడిపండ్లు, స్వీట్లు వంటి తియ్యటి పదార్థాలు తింటున్నారంటూ ఈడీ చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈడీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టింది. సీఎం కేజ్రీవాల్ను జైల్లోనే అంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ నేత, దిల్లీ మంత్రి అతిశి ఆరోపించారు. కేజ్రీవాల్ టైప్`2 డయాబెటిస్ పేషెంట్ అని… పదేపదే అభ్యర్థించినప్పటికీ ఇన్సులిన్ ఇవ్వడం లేదని ఆమె విమర్శించారు. ‘సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా మధుమేహం ఉందని అందరికీ తెలుసు… ఆయన గత 30 ఏళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. తన సుగర్ స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారు. అందుకే కోర్టు అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి, డాక్టర్ సూచించిన ఆహారాన్ని తినడానికి అనుమతించింది. కానీ బీజేపీ తన జేబు సంస్థ ఈడీ సాయంతో అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది’ అని అతిశి మండిపడ్డారు. కేజ్రీవాల్ స్వీట్ టీ తాగుతున్నారని, స్వీట్లు తింటున్నారని ఈడీ చెప్పిందాంట్లో నిజం లేదన్నారు. కేజ్రీవాల్జీకి డాక్టర్ సూచించిన స్వీటెనర్తో టీ,స్వీట్లకు అనుమతి ఉందని… ఇది డయాబెటిక్ రోగులకు ఇవ్వబడే తక్కువ కేలరీల స్వీటెనర్ అని తెలిపారు. కేజ్రీవాల్ తన బ్లడ్ సుగర్ స్థాయిని పెంచుకోవడానికి అరటిపండ్లు తింటున్నాడన్న ఈడీ ఆరోపణలు అతిశి తప్పుబట్టారు. ‘నేను ఈడీకి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా మధుమేహ వైద్యుడితో మాట్లాడండి. రోగులకు అరటిపండు, కొన్ని రకాల టోఫీ లేదా చాక్లెట్ ఎల్లప్పుడూ వారితో ఉంచుకోమని చెబుతారు. కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు లేదా జైలులో ఉన్నప్పుడు అతను ఎప్పుడూ ఏదో ఒక రకమైన టోఫీ, అరటిపండు అతనితో కలిగి ఉండాలని కోర్టు ఉత్తర్వులో స్పష్టంగా రాసి ఉంది’ అని తెలిపారు. సుగర్ స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్ డాక్టర్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ కేజ్రీవాల్ ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. కాగా దిల్లీ సీఎం అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. కేజ్రీవాల్కు ఇంటి భోజనానికి అనుమతి ఉండటంతో ఆయన నచ్చిన ఆహారం తీసుకుంటున్నారని తెలిపింది. టైప్-2 డయాబెటీస్తో బాధ పడుతున్నప్పటికీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అరటిపండు, మామిడి పండ్లు, స్వీట్లు, ఆలూ పూరీ వంటివి తింటున్నారని తెలిపింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం జైల్లో కేజ్రీవాల్ తీసుకుంటున్న భోజనంతో పాటు ఆయన డైట్ చార్ట్పై శుక్రవారం లోపు నివేదిక ఇవ్వాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. అనంతరం పిటిషన్పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.