చంద్రబాబు పుత్రుడు, దత్త పుత్రుడు హంతకుల్లా మాట్లాడుతున్నారని ఏపీ తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. చదవడం, రాయటం రాని లోకేష్ పాదయాత్ర చేస్తూ ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ మనవడిగా లోకేష్ను ప్రజలు స్వీకరించడం లేదన్నారు. అసలు ఆ పోలికే నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని.. లోకేష్ అయోమయంలో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. పవన్ .కళ్యాణ్ అమాయకుడని.. ఆయన అంటే తనకు సానుభూతి ఉందన్నారు. పవన్ను చంద్రబాబు వాడుకుంటున్నారని.. ఎన్టీఆర్ వారసులు రాజాకీయాల్లోకి వస్తే ఆదరించాలని కోరారు. నందమూరి ఫ్యాన్స్ చంద్రబాబు, లోకేష్లను తరిమి కొట్టాలని.. టీడీపీని తిరిగి నందమూరి కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో అవినీతిని తీసుకొచ్చి ప్రస్తుత వైఎస్సార్సీపీ హయాంలో జరిగినట్లు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పనికి మాలిన నారా లోకేష్ కోసం చంద్రబాబు కోట్లు ఖర్చు పెట్టి భాష నేర్పించినా మార్పు రాలేదన్నారు. చంద్రబాబు తనయుడిని కూడా సరైన మార్గంలో పెంచలేదని.. రూ.60 కోట్లు ఇచ్చి సర్టిఫికెట్లు కొని ఇతర దేశాల్లో చదువుకొన్నాడని అందరికి తెలుసన్నారు.కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్లకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్నారు. చంద్రబాబు, లోకేష్, దత్త పుత్రుడు కలిసి రాష్ట్రంలో ఎంత తిరిగినా లాభం లేదని.. ప్రజలు నమ్మరన్నారు. ఎక్కడో సినిమాలు చేసుకుంటున్న పవన్ని తెర మీదకు తెచ్చి.. కాపు నాయకుల్ని తిట్టిస్తున్నారు మండిపడ్డారు. విష వృక్షం నీడలో రాజకీయాలు చెయ్యొద్దని గతంలోనే పవన్కు సూచించాను అన్నారు. ఎన్టీఆర్ పాలన అద్భుతమని ప్రశంసించారు. చంద్రబాబు పాలనలో ఏపీలో అభివృద్ధి జరగలేదని.. అన్ని అబద్దాలు చెప్పి పాలన చేశారన్నారు. గతంలో వైఎస్సార్ ఎంతో అద్భుతంగా పాలన చేశారని.. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నారన్నారు. మేనిఫెస్టోలలో చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేశారని.. ఇచ్చిన హామీల్లో 99.5శాతం పూర్తి చేశారన్నారు. గత ప్రభుత్వాలు తమ పాలనలో 5 శాతం కూడా తమ మేనిఫెస్టో అమలు చేయలేదని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉందన్నారు. పోలవరం పనుల్లో చంద్రబాబు తీవ్ర అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చెయ్యలేదన్నారు. అవినీతిలో బాబుకి స్టాన్ఫర్డ్యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇవ్వొచ్చని.. సైకో, శాడిస్ట్ కాబట్టే ప్రశ్నించే వారిని గుర్రాలతో తొక్కించారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు టీడీపీ ఎక్కడా లెక్కలు చూపలేదన్నారు. నారా లోకేష్ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించుకునేందుకే చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారన్నారు. అమ్ముడు పోయే నాయకులు అన్ని పార్టీలో ఉంటారు.. అలాంటి చీడ పురుగులు వెళ్లిపోతేనే పార్టీ బలపడుతుంది అన్నారు. చంద్రబాబును రాజకీయంగా నమ్మకున్న వారు భూస్థాపితం కావడం ఖాయమన్నారు. పార్టీ గుర్తు మీద గెలిచి స్వార్దం కోసం పార్టీ మారారని విమర్శించారు. జగన్ కష్టపడుతున్నాడు గనుకే ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు.