Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఉగ్ర గోదావరి

10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద

జులై ప్రారంభంలో ఇంత వరద వందేళ్లలో ప్రథమం
16 లక్షల క్యూసెక్కులు దాటుతుందని అంచనా
తీర, దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
సహాయ శిబిరాల ఏర్పాటు
ప్రతి బాధిత కుటుంబానికి రూ.2 వేలు
నాలుగు జిల్లాలకు రూ.8 కోట్ల తక్షణ సాయం
ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ అత్యవసర సమీక్ష
ప్రాణం నష్టం జరగడానికి వీల్లేదని స్పష్టీకరణ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి/ కాకినాడ: ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జులై ప్రారంభంలోనే నదికి 10 లక్షల క్యూసెక్కులకు పైచిలుకు వరద రావడం విశేషం. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వందేళ్ల చరిత్రలో ఇంత పెద్ద వరద ఈ సమయంలో రావడం ఇదే మొదటిసారని జలవనరుల శాఖాధికారులు పేర్కొంటున్నారు. దీంతో నదీ తీర, దిగువ ప్రాంతాలన్నింటినీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మంగళవారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి, వరద సహాయక చర్యలపై సీఎం వారికి దిశానిర్దేశం చేశారు. జులై లోనే 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడం, రేపో, మాపో 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వరదల వల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదారినదికి వరదలు కొనసాగే అవకాశం ఉందని, ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకూడదని సీఎం స్పష్టం చేశారు. ‘కూనవరం, చింతూరుల్లో 2 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయి. కంట్రోలు రూమ్స్‌ సమర్థవం తంగా పనిచేయాలి. వి.ఆర్‌.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయి. లైన్‌ డిపార్ట్‌మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలి. అవసర మైనచోట వరద సహాయక శిబిరాలు తెరవండి. సహాయ శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలి. మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వండి. తక్షణ సహాయంగా వారికి ఉపయోగపడుతుందని సీఎం కలెక్టర్లకు సూచించారు.అలాగే పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలి. అత్యవసర మందులను అందుబాటులో ఉంచు కోవాలి. పారిశుధ్యం బాగుండేలా చర్యలు తీసుకోవాలి. తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి. కరెంట్‌ సరఫరాకు అంతరాయం వచ్చిన నేపథ్యంలో అత్యవసర సర్వీసులకు ఇబ్బంది లేకుండా జనరేటర్లను అందు బాటులో ఉంచుకోండి. తాగునీటికోసం ట్యాం కర్లను సిద్ధంచేసుకోవాలి. ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రతమత్తంగా ఉండండి. చెరువులు, ఇరిగేషన్‌కాల్వలు ఎక్కడ బలహీనంగా ఉన్నాయో అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోండి. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు, బోట్లు, లైఫ్‌ జాకెట్లు.. అవసరైన ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలి. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2కోట్ల చొప్పున నాలుగు జిల్లాలకు 8 కోట్ల తక్షణ నిధులు ఇస్తున్నామని తెలిపారు. వరద కారణంగా జరిగిన నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి రోజువారీ నివేదికలు పంపాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, వై.శ్రీలక్ష్మి, జి.సాయి ప్రసాద్‌, అజయ్‌ జైన్‌, కె.విజయానంద్‌, శశిభూషణ్‌, ముద్దాడ రవిచంద్ర, గిరిజాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img