. టీడీపీ, జనసేన అసంతృప్తులకు గాలం
. అధిష్ఠానం నుంచి పార్టీ నేతలకు ఫోన్లు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : టీడీపీ, జనసేన కూటమి తొలి జాబితాలో టికెట్లు దక్కని వారిపై వైసీపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరుతో దృష్టి పెట్టింది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు అధిష్ఠానం నుంచి ఫోన్లు వెళ్లాయి. తాడేపల్లిలో మంగళవారం జరగ బోయే వైసీపీ కీలక సమావేశానికి వారి పూర్తి వివరాలతో హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. టికెట్లు దక్కని అసంతృప్త, అసమ్మతి నేతలకు వ్యక్తిగతంగా ఎన్ని ఓట్లు ఉంటాయి, వారి బలాబలాలు, వారితో ఉన్న నేతల పరిస్థితి, పార్టీలోకి తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేని వారిని గుర్తించి పంపాలి అని సూచించినట్లు సమాచారం. టీడీపీ, జనసేన విడుదల చేసిన తొలి జాబితా అనంతరం రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో టికెట్లు దక్కక అటు టీడీపీలోను ఇటు జనసేనలోనూ నిరసనలు రేగాయి. ఎక్కడి కక్కడే అధినేతల తీరును వ్యతిరేకిస్తూ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. అనుచరులతో సమాలోచనలు నిర్వహించి, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. వారికి టీడీపీ, జనసేన నేతలు ఎంత బుజ్జగిం పులు చేపట్టినా వెనక్కితగ్గలేదు. తుదకు నియోజక వర్గాల నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వరకు నిరసనలు తాకాయి. దీంతో వారందర్నీ వైసీపీ గుర్తించి, అవసరమైతే వైసీపీలోకి చేర్చుకునేలా ఆధిష్ఠానం ఆలోచిస్తోంది. వైసీపీ ఏడు విడతలుగా ఇన్ఛార్జిల మార్పులు, చేర్పులు చేపట్టింది. అయినప్పటికీ పార్టీ బలో పేతంలో భాగంగా ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న వారిని చేరదీసే పనిలో నాయకత్వం నిమగ్నమైంది. ఇప్పటికే స్థానికంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలంతా టీడీపీ, జనసేన నేతల ఇళ్లకు వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ ప్రక్రియను రాబోయే రెండు రోజుల్లో వేగవంతం చేయనున్నారు. వైసీపీ కీలక సమావేశానికి 175 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయ కర్తలతోపాటు మండల, పట్టణ కేంద్రాల నుంచి గృహ మిత్ర, గృహ సారథులు దాదాపు 2,500 మంది తరలిరానున్నారు. ఈ సమావేశం ద్వారా వారికి ఎన్నికలపై సీఎం జగన్ దిశానిర్ధేశం చేయనున్నారు. అనంతరం ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరికలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టనున్నారు. అన్ని విధాలా పార్టీకి అనుకూలమని భావించిన వారికి వెంటనే చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు.