ఎన్నికలకు సిద్ధంకండి
టీడీపీకి ఓటేస్తే సంక్షేమానికి వ్యతిరేకంగా వేసినట్లే
అందరికీ న్యాయం చేసేందుకే మూడు రాజధానులు
వైసీపీ ప్లీనరీ ముగింపు సభలో సీఎం జగన్ పిలుపు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: మూడేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో మనం ప్రజలకు చేసిన మంచిని ప్రతి గడపకూ తీసుకెళ్లి పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని, ప్రస్తుతం అమలయ్యే పథకాలను కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని సీఎం స్పష్టం చేశారు. వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా రెండోరోజైన శనివారం పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన సీఎం జగన్ ప్రజలనుద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. చంద్రబాబును ఓడిరచే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదేనని, తనకున్న ఏకైక అండా దండా ప్రజలేనని పునరుద్ఘాటించారు. చక్రాలు లేని సైకిల్ను చంద్రబాబు తొక్కలేకపోతున్నారన్నారు. దుష్ట చతుష్టయం ఆయనను అధికారంలోకి తెచ్చేందుకు కుట్రలు చేస్తోందనీ, వీరి కుట్రలను సోషల్ మీడియా ద్వారా గ్రామ గ్రామానా తిప్పికొట్టాలని జగన్ పిలుపునిచ్చారు. అసత్యాలు, వెన్నుపోట్లు మనకు తెలీదనీ, వెన్నుపోటు ద్వారా అధికారం లాక్కోవడం అంతకంటే తెలీదని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాలను ఆపేయాలన్నేదే దుష్టచతుష్టయం కుట్రన్నారు. ఓట్ల కోసం దొంగ వాగ్దానాలతో చంద్రబాబు మళ్లీ మీ ముందుకొస్తారనీ, వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవడమే మన లక్ష్యం కావాలన్నారు. ఇదేమీ అసాధ్యం కాదనీ, ఎందుకంటే ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీతోపాటు, ఆ నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీలు గెల్చుకున్నామని గుర్తు చేశారు. దీనిని బట్టి కుప్పం ప్రజలు కూడా మనల్ని దీవించారని అర్థమవుతోందన్నారు. మీ కష్టాల పునాదులపైనే మన ప్రభుత్వం ఏర్పడిరదని, అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని, ప్రతి హామీని అమలు చేసేందుకు ప్రయత్నించానన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి దానిలో ఏం చెప్పామో.. అవే చేస్తున్నామన్నారు. నా ఫోకస్ అంతా ప్రజలకు మంచి చేయడం, వెనుక బడిన వర్గాలకు న్యాయం చేయడమేనని చెప్పారు. ఈ మధ్య చంద్రబాబు రింగ్లో చిప్ ఉందని చెబుతున్నారని, చంద్రబాబులా రింగ్లోనో, మోకాళ్లలోనో, అరికాళ్లలోనో చిప్ ఉంటే సరిపోదన్నారు. అది మనసులో ఉండాలని, ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్ చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు ప్రజల పట్ల మమకారం, ప్రేమ అన్నది ఏమాత్రం లేదనీ, పేదలు ఎదగకూడదన్నదే చంద్రబాబు, దుష్టచతుష్టయం విధానమన్నారు. వారి పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు. పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియమే చదవాలంటారు. కానీ మన ప్రభుత్వం ప్రభుత్వ బడులను కార్పొరేట్ తీసుకెళ్లడానికి శ్రమిస్తోంది. ఒక్క విద్యారంగం కోసమే తొమ్మిది పథకాలు తీసుకొచ్చి ఇప్పటిదాకా వాటి అమలుకు వేల కోట్లు నిధులు వెచ్చించామని వివరించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి.. కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని అర్జీ పెట్టుకోగా, దానిని రెవెన్యూ డివిజన్ చేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కిందన్నారు. కుప్పం ప్రజలకు మంచి జరగాలనే అలా చేశామన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేందుకు మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచన చేశామని, పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. చంద్రబాబు గతంలో మన పార్టీలో ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. 23 ఎమ్మెల్యేలను కొన్న పార్టీకి.. 2019లో అన్నే సీట్లు వచ్చాయి అని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు.ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన వైసీపీ ప్రయాణం.. ఇప్పుడు 151కి చేరింది. ఒక్క ఎంపీతో ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు 22కి చేరిందని, వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ సీట్లు గెల్చుకోవడమే లక్ష్యం కావాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రికి ముందు మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, జోగి రమేశ్, కాకాని గోవర్థన్ రెడ్డి, మేరుగ నాగార్జున, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, అనిల్కుమార్ యాదవ్ తదితరులు