టెహ్రాన్ : అఫ్గాన్లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు ఏర్పాట్లు వచ్చే వారానికి వాయిదా పడటంతో ఆ దేశంలో ఎన్నికలు జరపాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అభిప్రాయపడ్డారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా ఎన్నికలను నిర్వహించాలని అన్నారు. తిరిగి శాంతిని నెలకొల్పేందుకు ఇదొక్కటే మార్గామని, ప్రజాప్రభుత్వం రావాలని సూచించారు. అఫ్గాన్లో శాంతి`సుస్థిరతనే ఇరాన్ ఎప్పుడూ కోరుతుందని అన్నారు. రక్తపాతం, హత్యలు ప్రజల సార్వభౌమత్వాన్ని అంతం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆఫ్ఘానిస్థాన్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి మద్దతిస్తామని ఇబ్రహీం రైసీ ప్రకటించారు. అఫ్గాన్లో తమ ప్రభుత్వం అంతర్జాతీయ సమాజం మెచ్చేలా ఉండాలని, విస్తృత, సమ్మిళిత పాలనా యంత్రాంగాన్ని రూపొందించాలని తాలిబన్లు భావిస్తున్నట్లు వారి అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ వెల్లడిరచారు. కొత్త ప్రభుత్వం, కేబినెట్ సభ్యుల వివరాలను వచ్చేవారం ప్రకటిస్తామని తెలిపారు.