తాలిబన్ల కాల్పులు
కాబూల్: అఫ్గాన్ వ్యవహారంలో పాక్ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ..వందలాది మంది కాబూల్లో భారీ ప్రదర్శన చేపట్టారు. ‘మాకు పాకిస్థాన్ ప్రభుత్వం వద్దు, పాకిస్థాన్ ఆఫ్గాన్ను విడిచిపెట్టు..పాకిస్థాన్ తోలుబొమ్మ ప్రభుత్వం మా దేశంలో వద్దు’ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనకారులపై తాలిబన్లు కాల్పులు జరిపారు. ర్యాలీలో ఎక్కువ శాతం మహిళలే కావడం గమనార్హం. కాబూల్లో ఉన్న పాక్ రాయబార కార్యాలయం ముందు ఈ ప్రదర్శన జరిగింది. నిరసనలను కవర్చేస్తున్న కొంతమంది జర్నలిస్టులను అరెస్టు చేశారు. ‘ఐఎస్ఐ దూరంగా ఉండు’ అన్న ప్లకార్డులు చేపట్టారు. పంజ్షీర్ కూటమి బలగాలపై పాక్ సైన్యం వైమానిక దాడులు జరపడం అక్కడి ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించింది. నాటి అరాచక పాలన తిరిగి వస్తుందనే భయంతో అఫ్గాన్ పౌరులు ఆందోళన చెందుతున్నారు. కాబూల్, హెరాత్, మజర్ ఐ షరీఫ్ వంటి ప్రాంతాల్లో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. పాకిస్థాన్ కారణంగానే తాము తిరిగి అరాచక తాలిబన్ల పాలనలోకి వెళుతున్నామని అఫ్గాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల్ని నూతన ప్రభుత్వంలో భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు. పంజ్షీర్ను తాలిబన్లు ఆక్రమించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ పంజ్షీర్ ప్రతిఘటన బలగాలు మాత్రం తాము అఫ్గాన్ ప్రజలకోసం పోరాడతూనే ఉంటామన్నారు. తాలిబన్ ప్రతినిధులతో పాక్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఫయాజ్ హమీద్ భేటీ అయినటు ్లసమాచారంతో పాక్ జోక్యంపై తీవ్ర విమర్శలు చోటుచేసుకున్నాయి. తాలిబన్ నేత ముల్లా అబ్దుల్ బరాదర్ను ఐఎస్ఐ చీఫ్ కలవడంపై ప్రజలు ఆందోళన చెందుతుతున్నారు. ఇతర దేశాల జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. దేశంలోని ప్రభుత్వ ఏర్పాటుకు వివిధ వర్గాలు అడ్డుకుంటున్నాయి. అధికారం కోసం ముల్లా బరదార్ నేతృత్వంలో తాలిబన్కు చెందిన దోహా యూనిట్, తూర్పుఅఫ్గాన్లో పనిచేసే హక్కానీ నెట్వర్క్, తాలిబన్కు చెందిన కాందహార్ వర్గం పోటీలో ఉన్నాయి. పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ను తదుపరి ప్రధానిగా చేయడానికి ఏకాభిప్రాయం కుదిరిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.