Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అమెరికా అధ్యక్ష బరిలో వివేక్‌ రామస్వామి


. రిపబ్లికన్‌ అభ్యర్థిగా పోటీలోకి
. నిక్కీహేలీ తర్వాత రేసులో నిలిచిన రెండో భారత సంతతి వ్యక్తి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పీఠానికి భారత సంతతి వివేక్‌ రామస్వామి తన పోటీని ప్రకటించారు. 37ఏళ్ల రామస్వామి ఇండో`అమెరికన్‌ టెక్‌ ఎంట్రప్రెన్యూర్‌. ఈయన తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రామస్వామి ఇంతకుముందు ఓహియోలో జనరల్‌ ఎలక్ట్రిక్‌ ప్లాంట్‌ ఉద్యోగం చేశారు. తాజాగా అమెరికా రేసులో నిలవనున్నారు. రపబ్లికన్‌ పార్టీ తరపున తన అభ్యర్థిత్వాన్ని రామస్వామి అధికారికంగా ప్రకటించారు. భారత సంతతికి చెందిన నిక్కీహేలీ ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన క్రమంలో అమెరికా అధ్యక్ష రేసులో నిలిచిన రెండవ భారత సంతతి వ్యక్తిగా రామస్వామి ఉన్నారు. ఓ ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామి తాను అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్లు వెల్లడిరచారు. అమెరికా ఆదర్శాలను తిరిగి పునరుద్ధరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. ఇది రాజకీయ ప్రచారం మాత్రమే కాదు. తర్వాతి తరం అమెరికన్లకు కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమం అని చెప్పారు. ‘అమెరికా ఫస్ట్‌’కు సిద్ధమన్నారు.వివేక్‌ రామస్వామి 1985, ఆగస్టు 9న ఓహియోలో జన్మించారు. హార్వర్డ్‌, యేల్‌ యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించారు. ‘స్ట్రైవ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌’ను రామస్వామి స్థాపించినట్లు ఆయన లింక్డిన్‌ ప్రొఫైల్‌ ద్వారా తెలుస్తోంది. అంతకుముందు ఆయనకు ఔషధరంగంలో మంచి పేరు ఉంది. ‘రొవాంట్‌ సైన్సెస్‌’ను ఏర్పాటు చేశారు. రామస్వామి ఆస్తుల విలువ 600 మిలియన్‌ డాలర్లుగా 2016లో ఫోర్బ్స్‌ గణాంకాల పేర్కొన్నాయి. దీంతో 40 ఏళ్లలోపు సంపన్నుల్లో ఒకరిగా రామస్వామి నిలిచారు. ఆయన మాట్లాడుతూ, అమెరికా విదేశీ విధానాన్ని మార్చాలన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని చైనా అతిక్రమిస్తోందని ఆరోపించారు. చైనా నుంచి స్వాతంత్య్రాన్ని కోరుతూ తీర్మానించాలన్నారు. అమెరికా గగనతలంలోకి ప్రవేశించిన బెలూన్‌ చైనాది కాకుండా రష్యాకు చెంది ఉంటే దాన్ని తక్షణమే పేల్చివేసేవాళ్లమని, చైనా విషయంలో ఆ పనిచేయలేకపోయినట్లు చెప్పారు. ఆధునిక జీవనంలో భాగంగా ఎక్కువగా చైనామీదే ఆధారపడుతున్నామని, ‘ఎకనామిక్‌ కో డిపెండెంట్‌’ బంధాన్ని తెంచుకోవాలని, అది ఏ మాత్రం సులభమైనది కాబోదని రామస్వామి అన్నారు. ఇందుకోసం త్యాగాలు తప్పబోవన్నారు. కొన్ని అసౌకర్యాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని కూడా ఆయనన్నారు.
ఇదిలావుంటే, 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న నిర్ణయాన్ని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించాల్సి ఉంది. ఆయన పోటీ చేస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మార్చి లేదా ఏప్రిల్‌లో బైడెన్‌ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించనున్నట్లు తెలిపాయి. ఇదే జరిగితే డెమొక్రటిక్‌ పార్టీలో ఆయనకు పోటీ ఉండదు. ఇక రిపబ్లికన్‌ పార్టీ విషయానికొస్తే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డేశాంటిస్‌, మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, మాజీ కార్యదర్శి మైక్‌ పాంపియో వంటి వారు కూడా త్వరలోనే అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తామని ప్రకటించనున్నట్లు సంకేతాలు ఉన్నాయి. అయితే 2024 అధ్యక్ష రేసులో నిలవబోయే అభ్యర్థుల్లో ఏకైక మహిళా అవడమే కాకుండా నాన్‌వైట్‌ అభ్యర్థిగానూ ఆమె ఉంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img