కాబూల్: అఫ్గానిస్తాన్లోని బల్క్ ప్రావిన్స్లోని తాలిబన్ గవర్నర్ కార్యాలయం వద్ద పేలుడు (ఆత్మాహుతి దాడి) జరుగగా, గవర్నర్తో పాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ‘గవర్నర్ కార్యాలయం భవనం రెండో అంతస్తులో గురువారం ఉదయం 9 గంటలకు పేలుడు సంభవించింది. గవర్నర్ మౌలావి మహమ్మద్ దావూద్ ముజమ్మిల్ మరణించారు’ అని బాల్క్ పోలీసు అధికార ప్రతినిధి మహమ్మద్ ఆసిఫ్ వజీరి తెలిపారు. ఇది ఆత్మాహుతి దాడి అని, దీనికి ఐఎస్ గ్రూపు బాధ్యత వహించిందని పోలీసులు తెలిపారు. మహమ్మద్ దావూద్ ముజమ్మిల్ హత్యను ప్రాంతీయ రాజధాని అధికారి మజర్ ఏ షరీఫ్ ధ్రువీకరించారు.
2021లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యకు గురైన అత్యంత సీనియర్ ఈయనేనన్నారు. కాగా మహమ్మద్ దావూద్ ముజమ్మిల్ నాన్గర్హర్ తూర్పు ప్రావిన్స్కు గవర్నర్గా ఉన్నప్పుడు ఐఎస్ వ్యతిరేక పోరు సాగించారు. ఆయన గతేడాది అక్టోబరులో బల్క్ ప్రావిన్స్కు వచ్చారు. ‘భారీ విస్ఫోటనం జరిగింది. నేను కింద పడి తీవ్రంగా గాయపడ్డాను. నా మిత్రుడు చేయి కోల్పోయారు’ అని ప్రత్యక్ష సాక్షి ఖైరుద్దీన్ తెలిపారు.