. ముగ్గురు మృతి… 200 మందికిపైగా గాయాలు
. బలహీనంగా ఉన్న భవనాలు నేలమట్టం
. రిక్టర్ స్కేల్పై 6.4 తీవత్ర నమోదు
అంకారా: రెండు వారాల క్రితం సంభవించిన భారీ భూకంపం ధాటికి అతలాకుతలమైన టర్కీపై మరోసారి భూకంపం విరుచుకుపడిరది. హతాయ్ ప్రావిన్సులో సోమవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్టు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మాలాజికల్ సెంటర్ తెలిపింది. టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా దీనిని ధ్రువీకరించింది. భూకంప కేంద్రం దక్షిణ టర్కీ నగరం అంటాక్యా సమీపంలోని 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రభావం సిరియా, ఈజిప్టు, లెబనాన్లోనూ కనిపించింది. తాజా భూకంపం కారణంగా ఇప్పటికే బలహీనపడిన కొన్ని భవనాలు కూలిపోయాయి. హతాయే మేయర్ లుత్ఫు సవస్ మాట్లాడుతూ… ఇప్పటికే బలహీనపడిన కొన్ని భవనాలు కూలిపోయి శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు నివేదికలు అందాయన్నారు. ఇప్పటి వరకూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, 200 మంది గాయపడ్డారని టర్కీ హోంశాఖ మంత్రి సులేమాన్ సోయ్లూ చెప్పారు. టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ మాత్రం ఒకరు మాత్రమే చనిపోయారని, చాలా భవనాలు కూలిపోయినట్టు స్థానికులు చెప్పినా రెండు వారాల కిందట సంభవించిన భూకంపం తర్వాత భయంతో పట్టణవాసులు వేరే చోటకు వెళ్లిపోయారని చెప్పింది. ‘భూమి మళ్లీ కంపించడం మొదలైనప్పుడు నా కాళ్ల కింద భూమి చీలిపోతుందని నేను అనుకున్నాను’ అని సెంట్రల్ అంటాక్యాకు చెందిన మునా అల్ ఒమర్ అనే ఓ మహిళ కన్నీరుపెట్టుకుంది. ఓ పార్కులో టెంట్ వేసుకుని తన ఏడేళ్ల కుమారుడితో బిక్కుబిక్కుమని గడుపుతోంది. ఇక, ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపం కారణంగా టర్కీ, సిరియాలో 47 వేల మందికిపైగా మృతిచెందారు. ఒక్క టర్కీలో 41,156 మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది గాయపడ్డారు. 3,85,000 భవనాలు కూలిపోయాయి. భూకంపంతో అతలాకుతలమైన టర్కీకి ప్రపంచ దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి.
సహాయక చర్యల కోసం బలగాలను పంపి, సామాగ్రిని కూడా అందజేస్తున్నాయి. భారత్ నుంచి ఎమర్జెన్సీ సిబ్బంది, వైద్య బృందాలు టర్కీలోని దక్షిణ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కాగా, భూకంప బాధితుల్లో 3,56,000 మంది గర్భిణిలు ఉన్నారని, వారికి అత్యవసర వైద్య సేవలు అందజేయాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి లింగ, పునరుత్పత్తి ఆరోగ్య విభాగం పేర్కొంది. టర్కీలో 226,000, సిరియాలో 130,000 మంది గర్భిణీలు ఉండగా.. వీరిలో 38,800 మందికి వచ్చే నెలలో ప్రసవాలు జరగనున్నాయి. చాలా మంది సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఓవైపు శీతల వాతావరణం.. మరోవైపు సరైన ఆహారం, తాగు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు.