న్యూదిల్లీ: ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావెద్ అక్తర్ పాకిస్తాన్ను ఆ దేశంలోనే విమర్శించారు. 26/11 ముంబై ఉగ్రపేలుళ్ల ఘటనను గుర్తుచేసుకున్న ఆయన… ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా లాహోర్లో స్వేచ్ఛగా తిరుగతున్నారంటూ దుయ్యబట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ స్మారకార్థం ఇటీవల లాహోర్లో ఫైజ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జావెద్ అక్తర్కు ఆహ్వానం లభించడంతో ఆయన పాక్లో పర్యటించారు. ఈ ఫెస్టివల్లో పాల్గొన్న ఆయన… అక్కడ విలేకరులతో మాట్లాడుతూ భారత్-పాక్ సంబంధాలు, ముంబై ఉగ్రదాడుల ఘటనను ప్రస్తావించారు. ‘‘ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. పైగా ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. వాటిని తగ్గించాల్సిన అవసరముంది. మేం ముంబైకి చెందిన వాళ్లం. మా నగరంలో ఉగ్రవాదులు ఎంతటి బీభత్సాన్ని సృష్టించారో మా కళ్లారా చూశాం. వారు(ముష్కరులు) నార్వే లేదా ఈజిప్టు నుంచి వచ్చిన వారు కాదు. వాళ్లు ఇంకా మీ దేశంలోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారు కదా. అలాంటప్పుడు భారత్ దాని గురించి ఫిర్యాదులు చేసినప్పుడు మీరు దాన్ని ప్రతికూలంగా తీసుకోవాల్సిన అవసరం లేదు’’ అని అక్తర్ వ్యాఖ్యానించారు. ఇక భారత ఆర్టిస్టులను పాక్ లో గౌరవించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘‘నుశ్రత్ ఫతే అలీ ఖాన్, మెహదీ హసన్ లాంటి పాక్ కళాకారుల గౌరవార్థం మేం పెద్ద కార్యక్రమాలు చేపడుతున్నాం. కానీ లతా మంగేష్కర్ కోసం పాక్ ఎప్పుడైనా ఫంక్షన్ ఏర్పాటు చేసిందా?’’ అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు సోషల్మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.