సమర్కండ్: చైనా, తజికిస్తాన్ పరస్పరం దృఢమైన మద్దతును, ద్వైపాక్షిక సంబంధాలలో మరింత ఖచ్చితమైన ఫలితాలను తీసుకురావాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పిలుపునిచ్చారు. తజిక్ అధ్యక్షుడు ఎమోమాలి రహ్మోన్తో సమావేశమైన సందర్భంగా అన్నారు. 30 ఏళ్ల క్రితం ఏర్పడిన దౌత్య సంబంధాలు పుంజుకున్నాయని చెప్పారు. జాతీయ స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం, భద్రతను పరిరక్షించడంలో చైనా తజికిస్తాన్కు మద్దతు ఇస్తుందన్నారు. చైనా ఎల్లప్పుడూ పొరుగు దేశం, స్నేహితుడు , భాగస్వామిగా తజికిస్తాన్ను విశ్వసిస్తుందన్నారు. అంతర్జాతీయ, ప్రాంతీయ సంక్లిష్టమైన పరిస్థితుల్లో చైనా, తజికిస్థాన్ పరస్పరం దృఢమైన మద్దతును అందించడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచవలసిన అవసరం ఉందని జి అన్నారు. తజికిస్థాన్తో ఆచరణాత్మక సహకారాన్ని పెంపొందించడానికి, నాణ్యమైన తజిక్ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతిని విస్తరించడానికి, ద్వైపాక్షిక వాణిజ్యం స్థాయిని పెంచడానికి, మౌలిక సదుపాయాలు, నీటి నిర్వహణ, రవాణా రంగాలలో ముందస్తు సహకారం, గ్రీన్ టెక్నాలజీ, డిజిటల్ ఎకానమీలో సహకారం గురించి చర్చించడానికి చైనా సంసిద్ధతను జిన్పింగ్ నొక్కిచెప్పారు. కృత్రిమ మేధస్సు, సరిహద్దు రవాణా సామర్థ్యాన్ని ప్రోత్సహించడంలో చైనా తజికిస్తాన్కు సహాయం చేస్తుందన్నారు. తీవ్రవాద వ్యతిరేక సహకారాన్ని మరింతగా పెంచడానికి, ఈ ప్రాంతంలో శాంతి, ప్రశాంతతను సంయుక్తంగా కాపాడేందుకు తజికిస్థాన్, ఇతర మధ్య ఆసియా దేశాలతో కలిసి పని చేయడానికి చైనా సిద్ధంగా ఉందని జి చెప్పారు.
ఈ సంవత్సరం తజికిస్తాన్, చైనాల మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు 30 ఏళ్లు పూర్తవుతుందని, గత మూడు దశాబ్దాలుగా, ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని రహ్మాన్ పేర్కొన్నారు. తజికిస్తాన్ వన్-చైనా సూత్రానికి కట్టుబడి ఉందన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) 20వ జాతీయ మహాసభలు పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని రెహమాన్ ఆకాంక్షించారు.