వాషింగ్టన్: భారత్ సంతతి అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నాయకులు నిక్కీ హేలే వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష బరిలోకి అడుగుపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 15న ప్రత్యేక ప్రకటన వెలువడనుంది. ఇందుకోసం నిక్కీ ఇప్పటికే ఆహ్వానాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంపారు. ‘జాయిన్ నిక్కీ హేలే ఫర్ స్పెషల్ అనౌన్స్మెంట్’ అంటూ ఆహ్వానంలో పేర్కొన్నారు. నిక్కీ ‘ప్రత్యేక ప్రకటన’పై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తారని అంతా భావిస్తున్నారు. కాగా, నిక్కీ (51) దక్షిణ కరోలినా గవర్నర్గా రెండు పదవీ కాలాలను చేపట్టారు. ఐక్యరాజ్య సమితికి అమెరికా దౌత్యాధికారిగానూ గతంలో పనిచేశారు. ఇప్పుడు అధ్యక్ష రేసులోకి రావడంతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై నేరుగా పోటీని ప్రకటించే తొలి అభ్యర్థిగా నిలుస్తారు. 2024లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి ఏకైక నామినీగా ట్రంప్ ఉన్న విషయం విదితమే.