నేపాల్ ప్రధానిపై సుప్రీంలో రెండు రిట్ పిటిషన్లు
ఖాట్మండు: నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ మంగళవారం దాఖలైంది. మావోయిస్టు తిరుగుబాటు క్రమంలో దశాబ్దంలో జరిగిన ఐదువేల హత్యలకు బాధ్యత వహిస్తానన్న ఆయనను అరెస్టు చేసి, దర్యాప్తు చేపట్టాలని పిటిషన్ కోరింది. న్యాయవాదులు జ్ఞానేంద్ర అరన్, కల్యాణ్ బుధాతోకి వేర్వేరుగా రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు నాటి ఘర్షణ బాధితులు పిటిషనర్లుగా ఉన్నారు. రిట్ పిటిషన్ల దాఖలు చేసేలా కోర్టు యంత్రాంగానికి శుక్రవారం జస్టిస్ ఈశ్వర్ కాటివాడా, జస్టిస్ హరికృష్ణ ఫుయల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ‘నేను 17,000 మందిని చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవి అవాస్తవం. అప్పట్లో జరిగిన ఐదువేల హత్యలకు బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని ఖాట్మండులో మాఘి ఉత్సవంలో మాట్లాడిన ప్రచండ చెప్పారు. మిగతా 12వేల హత్యలకు ఫ్యూడల్ పాలకులే బాధ్యులని తెలిపారు. 1996, ఫిబ్రవరి 13న ప్రారంభమైన తిరుగుబాటు 2006, నవంబరు 21న శాంతి ఒప్పందంతో ముగిసింది. ఇదిలావుంటే, మావోయిస్టు నాయకులు భేటీ అయి శాంతి ఒప్పందానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలు జరిగినా ప్రతిఘటించాలని, నిరసన తెలపాలని నిర్ణయించినట్లు తాజా ప్రకటనలో తెలిపారు. నిజాలు, సంధి కమిషన్ ద్వారా న్యాయం దిశగా శాంతి ఒప్పందం నేపథ్య చర్చలు సాగాలని పేర్కొన్నారు. వేర్వేరు సమయాల్లో ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాల అములుకూ పార్టీ సభ్యులు కట్టుబడి ఉన్నట్లు వెల్లడిరచారు.