మాడ్రిడ్ : నవంబర్ 13, 14 తేదీలలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ వర్కర్స్ ఆఫ్ స్పెయిన్ (పీసీటీఈ) 2వ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో అస్టర్ గార్సియాను పీసీటీఈ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నుకుంది. ముగ్గురుతో కూడిన కంట్రోల్ కమిషన్ను ఎన్నుకుంది. నూతన పొలిట్ బ్యూరోను నియమించింది. దీనిని సెంటెనియల్ కాంగ్రెస్ అని పిలుస్తారు. నవంబర్ 1921లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ స్పెయిన్ను స్థాపించారు. రెండు రోజుల చర్చల సమావేశంలో ప్రతినిధులు రాజకీయ నివేదికపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. నవంబర్ 2017లో జరిగిన పార్టీ శాసన సంస్కరణలతోపాటు గత కాంగ్రెస్ నుండి పార్టీ నిర్వహించిన పనులను విశ్లేషించింది. వివిధ సమస్యలపై ఏడు సంక్షిప్త తీర్మానాలను కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. కాంగ్రెస్ ముగింపు కార్యక్రమంలో క్యూబన్ ఎంబసీ, పొలిసారియో ఫ్రంట్, స్టూడెంట్ ఫ్రంట్, ప్రొలెటేరియన్ యూనియన్, వర్కర్స్ కమిషన్స్ (సిసిఒఒ), జనరల్ యూనియన్ ఆఫ్ వర్కర్స్ (యుజిటి) ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటర్-యూనియన్ కాన్ఫెడరేషన్ (కాన్ఫెడరేషన్ ఇంటర్సిండికల్), వివిధ కంపెనీల యూనియన్ విభాగాల ప్రతినిధులతోపాటు విదేశీ పార్టీలు, సంస్థల నుండి 28 శుభాకాంక్షల సందేశాలు వచ్చాయి.