ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి భూములు మావి అంటున్నారు…!
ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలంటూ మూలపాడు ఎస్సీల ఆందోళన…
సాగులో ఉన్న భూములా లేక సాగులో లేని భూములా తేల్చాల్సింది అధికారులే…
విశాలాంధ్ర-మైలవరం (ఇబ్రహింపట్నం) : వ్యవసాయం జీవనోపాధిగా చేసుకొని ఏళ్ల తరబడి కృష్ణమ్మ ఒడిలో జీవనం సాగిస్తున్న ఎస్సీ రైతులకు కష్టాలు వచ్చిపడ్డాయి.. భూమిని నమ్ముకొని బతుకుతున్న సొసైటి రైతుల నోటి దగ్గర కూడు లాగేసే పరిస్థితులు నెలకొన్నాయి.. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మూలపాడు, త్రిలోచనాపురం గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల చెందిన ఒక మూడు అసోసియేషన్ లు కృష్ణానదీ తీర ప్రాంతంలోనీ సర్వే నంబర్ 209 లో నీ సుమారు 300 ఎకరాలు మేర అసోసియేషన్ కింద రైతులు సాగు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా మరో అసోసియేషన్కు 57 ఎకరాలు మేర భూములు లాగేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఉన్నపళంగా 57 ఎకరాలు వేరే వారికి వ్యవసాయం చేయడానికి ఇవ్వడం అంటే తమ నోటి కాడ కూడు తీసి పెట్టడమే అవుతుందని ఎస్సీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అసలు మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం ఆ భూములు ఎందుకు ఇతరులకు కేటాయిస్తున్నారు.. అసలు ఇస్తున్నారా లేదా..ఆ భూముల్లో వ్యవసాయం జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. అసోసియేషన్ సభ్యులు, రైతుల ఆందోళనల నేపథ్యంలో మండల రెవెన్యూ అధికారులు ఈ వివాదం పై అటు రైతులకు, ఇటు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది..