విశాలాంధ్ర`ఆస్పరి : రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా వైయస్సార్సీపి ప్రభుత్వం కృషి చేస్తుందని సింగిల్ విండో చైర్మన్ కట్టెల గోవర్ధన్ అన్నారు. మంగళవారం రామతీర్థం క్షేత్రం దగ్గర రూ.80 లక్షలతో నిర్మిస్తున్న రెండు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ గోదాముల నిర్మాణ పనులకు చైర్మన్ గోవర్ధన్, జిల్లా కేడిసిసి డైరెక్టర్ రాఘవేంద్ర, జెడ్పిటిసి దొరబాబు, వైకాపా కన్వీనర్ పెద్దయ్య, సీఈఓ అశోక్ నాయుడు చేతులు మీదుగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండలంలో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఆస్పరి, చిగళి గ్రామాలలో ఒక్కొక్కటి రూ.40 లక్షలు చొప్పున 500 మెట్రిక్ టన్నులు, చిన్నహోతూరు, జొహరాపురం గ్రామాలలో ఒక్కొక్కటి రూ.75 లక్షల చొప్పున వెయ్యి మెట్రిక్ టన్నుల నిర్మాణంతో గోదాములు మంజూరు అయ్యాయన్నారు. చిగళి గ్రామంలో ప్రభుత్వ స్థలం లేనందున ఆస్పరిలో రెండు ఒకే చోట నిర్మాణం చేపడుతున్నట్లు తెలియజేశారు. రైతులు పండిరచిన పంటలను నిల్వ ఉంచుకోవడానికి ఈ గోదాములు ఎంతగానో ఉపయోగపడతాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు బాంధవుడని మరోసారి నిరుపితమైందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశయం నెరవేరేలా అధికారులు, కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో నిర్మాణపు పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు శ్రీనివాసులు యాదవ్, కురువ రంగన్న, వైకాపా నాయకులు తిమ్మప్ప, ప్రకాష్, శ్రీరాములు, విజయ్ కుమార్, రామాంజనేయులు, వీరేంద్ర, సొసైటీ సిబ్బంది, సూపర్వైజర్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.