చండీగఢ్ : రాష్ట్రంలో ఎన్నికలు ప్రకటించే వరకు ఓటర్లకు చేరువయ్యే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఎటువంటి ర్యాలీలు నిర్వహించబోమని రైతులకు ఇచ్చిన హామీని పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్సింగ్ ఉల్లంఘించారని ఆప్ ఎంఎల్ఏ అమన్ అరోరా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి చర్యలను కట్టడిjైునా చేయాలి లేదా ఇతర రాజకీయపార్టీలను కూడా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతించాలని సంయుక్త్ కిసాన్ మోర్చాను అరోరా కోరారు. ముఖ్యమంత్రి అమరేందర్, ఎస్బిఎస్ నగర్లో పీఏయూ- కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ , హోషియార్పూర్లో ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల ముసుగులో అమరేందర్, ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆరోరా ఆరోపించారు. ఎన్నికలు ప్రకటించే వరకు పంజాబ్లో రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించవద్దన్న రైతుల ఆదేశాలకు ముఖ్యమంత్రి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాజకీయ పార్టీలతో కిసాన్ మోర్చా సమావేశంలో నిర్ణయించిన షరతులకు ఇది ‘స్పష్టమైన ఉల్లంఘన’ అని అరోరా అన్నారు. ఫాంహౌస్లో కూర్చున్న అమరేందర్, నాలుగున్నర సంవత్సరాల తరువాత ఇప్పుడు ఎన్నికలకు ముందు ప్రజల వద్దకు వెళ్లారని ఆరోపించారు. పంజాబ్లో రైతుల నిరసన ఆర్థికాభివృద్ధికి విఘాతం కలిగిస్తోందని అమరేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యపై అరోరా మాట్లాడుతూ.. ‘రైతుల నిరసన కారణంగా రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతోందని అమరీందర్ సింగ్ విశ్వసిస్తే, ఈ నిరసనలకు ముందు పంజాబ్ను ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడటానికి తాను ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పాలని అరోరా కోరారు. ‘‘పంజాబ్లో రైతులు కాకుండా ఉపాధ్యాయులు, వైద్యులు, అంగన్వాడీ వర్కర్లు, రోడ్వేస్ ఉద్యోగులు సహా అనేక విభాగాలు ధర్నాలు చేస్తున్నాయి. అమరేందర్ సింగ్ వారిని కూడా దిల్లీ లేదా హరియాణాకు పంపాలనుకుంటున్నారా’ అని ప్రశ్నించారు. ఇదిలావుండగా రాష్ట్రంలో రైతులు, కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు, నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలపై చర్చించడానికి పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆప్ నాయకుడు హర్పాల్ సింగ్ చీమా డిమాండ్ చేశారు.