శ్రీనగర్ : జమ్మూకశ్మీరులో సాధారణ పౌరులపై ఉగ్రదాడులు పెరుగుతుండటంతో కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) అదనపు దళాలను పంపిస్తోంది. సీఆర్పీఎఫ్ బలగాలు 3వేలు, బీఎస్ఎఫ్ బలగాలు 2,500 మోహరించనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 138 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని, 39 మంది ఉగ్రవాదులను, వారి కోసం క్షేత్రస్థాయిలో పని చేసే 700 మందిని అరెస్టు చేసినట్లు కశ్మీరు ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడిరచారు. విజయ్ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని నిలువరించే చర్యల్లో భాగంగా 138 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. జమ్మూ ఏడీజీపీ ముఖేశ్ సింగ మాట్లాడుతూ జమ్మూ డివిజన్లో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు, 16 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఉగ్రవాదులు సులువుగా దాడి చేయడానికి సామాన్యులను లక్ష్యంగా చేసుకుంటున్నారని సీఆర్పీఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉగ్రవాదుల వ్యూహం మారడంతో అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించి, అమలు చేస్తున్నట్లు తెలిపారు. కశ్మీరు లోయలో భద్రతా దళాల నిఘాను పెంచామన్నారు. శ్రీనగర్లో సాధారణ పౌరులపై దాడులు పెరుగుతుండటంతో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీఎస్ఎఫ్ ఇప్పటికే అదనంగా 25 కంపెనీల దళాలను కశ్మీరులో మోహరించిందన్నారు. సీఆర్పీఎఫ్ 25 కంపెనీలను మోహరించిందని, అదనంగా మరో 5 కంపెనీలను వచ్చే వారం పంపించబోతోందని చెప్పారు.
ప్రజలందరికీ కట్టుదిట్టమైన భద్రత కల్పించడం చాలా కష్టమనే భావం వ్యక్తమవుతోంది. శ్రీనగర్లో జన సాంద్రత ఎక్కువ కావడం వల్ల ప్రతి ఒక్కరికీ భద్రత కల్పించడం చాలా భారీ కార్యక్రమమవుతుందని అధికారులు అంటున్నారు. ఉగ్రవాదులు గత నెలలో ఇద్దరు టీచర్లను, ఓ వీధి వ్యాపారిని, ఓ కెమిస్ట్ను హత్య చేశారు. సోమవారం ఓ సేల్స్మ్యాన్, ఆదివారం మరో సాధారణ పౌరుడు ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుండగా, జమ్మూకశ్మీరులో తనిఖీలు పెంచారు. రోజుకు 8వేల వాహనాలను భద్రతా దళాలు తనిఖీ చేస్తున్నాయి. కశ్మీరు లోయలో సాధారణ పౌరుల హత్య తమ పనేనని లష్కరే తోయిబా, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థలు ప్రకటించాయి. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో స్థానికేతరులు వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించింది. కశ్మీరు లోయ నుంచి వెళ్లపోకపోతే స్థానికేతరులు తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.