సర్వే వెల్లడి
న్యూదిల్లీ : ఫేస్బుక్ వినియోగదారుల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి ఈ యాప్ వల్ల నిద్ర, పని, బంధాలు, పిల్లల పెంపకం వంటి వాటిల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఫేస్బుక్ స్వయంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు వాల్స్ట్రీట్ జర్నల్ తెలిపింది. యాప్ను వినియోగిస్తోన్న మొత్తం 2.9 బిలియన్ల మంది వినియోగదారుల్లో 360 మిలియన్ల మంది (12.5శాతం`36 కోట్లమంది) ప్రభావితమవుతున్నారని సంస్థ అంచనా వేసింది. ఈ యాప్ వినియోగానికి బానిసగా మారిన వారిలో ఈ విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పరిశోధనా పత్రం పేర్కొంది. కాగా, ఇవన్నీ ఫేస్బుక్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటువంటి వినియోగాన్ని ఫేస్బుక్ సమస్యాత్మకంగా పేర్కొంది. సాధారణంగా మెటాతో సహా ఏ సోషల్ మీడియా కంపెనీ అయినా వినియోగదారులు తరచూ తమ యాప్ను వినియోగించాలని కోరుకుంటుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కొన్నేళ్ల క్రితమే ఫేస్బుక్ దుష్ప్రభావాలను అంచనా వేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం అనేక సూచనలు చేసింది. కానీ, 2019లో ఈ బృందాన్ని ఫేస్బుక్ రద్దు చేసింది. 2020లో అంతర్గత సమావేశంలో తాము కనుగొన్న అంశాలను ఈ బృందం ప్రస్తావించింది. ఇటీవల ఫేస్బుక్ అంతర్గత పత్రాలను ఫ్రాన్సిస్ హ్యూగన్ అనే మాజీ ఉద్యోగి ‘ఫేస్బుక్ ఫైల్స్ సిరీస్’ పేరిట విడుదల చేయడంతో ఇవి వెలుగు చూశాయి. ఇన్స్టాగ్రామ్ వాడిన వినియోగదారులు మానసికంగా ప్రతికూల ప్రభావానికి గురవుతున్నారని ఇన్సైడర్లోని బెన్ గిల్బెర్ట్ నివేదిక పేర్కొంది.