ముంబై : మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ను నియంత్రించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని అత్యవసర విచారణకు స్వీకరించడానికి బోంబే హైకోర్టు బుధవారం నిరాకరించింది. దీంతో మంత్రి మాలిక్కు కొంతమేరకు ఊరట లభించినట్లు అయింది. మాదక ద్రవ్యాలతో సతమతమవుతున్న బాధితుల పునరావాసం కోసం పాటుపడుతున్న నగరవాసి కౌసర్ అలీ మంగళవారం ఈ పిల్ దాఖలు చేశారు. షారూఖ్ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారిస్తున్న ఎన్సీబీ లేదా ఇతర ఏ విచారణ సంస్థపైనా వ్యాఖ్యలు చేయకుండా మాలిక్ను కట్టడి చేయాలని హైకోర్టును అలీ వేడుకున్నారు. మంత్రి మాలిక్ వ్యాఖ్యల కారణంగా దర్యాప్తు అధికారులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని తెలిపారు. పిల్పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాది అశోక్ సరోగి వాదించారు. చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎంఎస్ కర్ణిక్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, వచ్చే వారం ప్రారంభమయ్యే వెకేషన్ బెంచ్ను సంప్రదించాలని హైకోర్టు పిటిషనర్కు సూచించింది. లేదా దీపావళి సెలవుల తర్వాత ప్రారంభమయ్యే రెగ్యులర్ కోర్టుల కోసం వేచిచూడాలని తెలిపింది.