తిరువనంతపురం : ప్రమఖ శబరిమల అయ్యప్ప దేవాలయం ‘తులామసం’ పూజల కొరకు శనివారం తెరవనున్నట్టు ట్రావెన్కోర్ దేవాలయం బోర్డు గురువారం తెలిపింది. అనంతరం ‘మేళశాంతి’ (ప్రధాన పూజారి) ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తంత్రికందరారు మహేష్ మోహనరు ఆధ్వర్యంలో ప్రస్తుత మేళశాంతి వీకే జయరాజ్ పొట్టి దేవాలయంలో దీపాలు వెలిగిస్తారని వివరించింది. అలాగే అక్కడే ఉన్న ఉపదేవత ఆలయంలో కూడా దీపాలు వెలిగిస్తారని పేర్కొంది. అయ్యప్ప స్వామి విగ్రహం ముందు ఉండే 18వ మెట్టుమీద కూడా దీపం వెలిగిస్తారని, దేవాలయం తెరిచిన రోజున ఎలాంటి పూజలు ఉండవని స్పష్టం చేసింది. 17వ తేదీన ‘ఉషపూజలు’ అయిన తరువాత శబరిమల, మలికాప్పురం దేవాలయాలకు సంబంధించి మేళశాంతులను డ్రా ద్వారా ఎంపిక చేస్తామని పేర్కొంది. అక్టోబరు 17 నుంచి 21 వరకూ ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న తరువాతే భక్తులను అనుమతిస్తామని తెలిపింది. అలాగే దేవాలయాలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్`19 వాక్సిన్ సర్టిఫికెట్ చూపించాలని లేని పక్షంలో ఆర్టీపీసీఆర్ నెగటివ్ టెస్టును చూపాల్సి ఉంటుందని పేర్కొంది. ‘నెయ్యాభిషేకం, ఉదయాస్తమానుపూజ, కలభాభిషేకం, పడిపూజ, పుష్పాభిషేకం’ వంటివి ఈ సమయంలో చేస్తామని వివరించింది. ఈక్రమంలోనే అక్టోబరు 21న దేవాలయం మూసివేసి, నవంబరు 2న ‘చైత్ర అట్టావిశేషం’ రోజున తెరుస్తామని, నవంబరు 3న మూసి, తిరిగి నవంబరు 15న ‘మండలం మకరవిలక్కు’ పండుగ రోజున తెరుస్తామని పేర్కొంది.