పూర్ణియా(బీహార్): ప్రార్ధనాస్థలాల వద్ద లౌడ్స్పీకర్లు ఉపయోగించడంపై జరుగుతున్న వివాదాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కొట్టిపారేశారు. మత కార్యక్రమాల విషయంలో తమ ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని స్పష్టంచేశారు. ఉత్తర బీహారు జిల్లా పూర్ణియాకు ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన నితీశ్కుమార్ శనివారం కొద్దిసేపు విలేకరులతో ముచ్చటించారు. లౌడ్స్పీకర్ల వివాదం అనవసరమని ఆయన తేల్చిచెప్పారు. ప్రార్థనాస్థలాల్లో లౌడ్స్పీకర్లు ఉపయోగించుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. ‘ఈ అర్థంలేని వ్యవహారంపై నేను మాట్లాడను. ఏ మతానికి సంబంధించిన అంశమైనా బీహారులో మేము జోక్యం చేసుకోం. ఈ విషయం అందరికీ తెలుసు. ఇది మా సొంత వ్యవహారమని కొంతమంది అనుకుంటున్నారు. నిషేధం అంటున్నారు. ఇదంతా ఓ పిచ్చి వ్యవహారం’ అని నితీశ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లో మాదిరిగా బీహారులోనూ లౌడ్స్పీకర్లను నిషేధించాలని బీజేపీ నాయకులు చేస్తున్న డిమాండ్పై సీఎం నితీశ్ స్పందించారు. లౌడ్స్పీకర్ల వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయంటూ యూపీలో యోగి ప్రభుత్వం లౌడ్స్పీకర్లను నిషేధించింది. దీనిపై నితీశ్ పరోక్షంగా బీజేపీ నాయకులను నిందించారు.