న్యూదిల్లీ : ఆప్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను బీజేపీ అడ్డుకుంటోందని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు. పనులను అడ్డుకోవడం కోసం తప్పుడు ఆరోపణలతో వివిధ దర్యాప్తు సంస్థలకు బీజేపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా కాలంలో దిల్లీలో ఆప్ ప్రభుత్వం నిర్మించిన ఏడు తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని బీజేపీ నేతలు చేసిన ఆరోపణల ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ అవినీతి నిరోధక శాఖ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో సిసోడియా ఈ మేరకు స్పందించారు. తమ ప్రభుత్వం నీతి నిజాయితీగా పని చేస్తుందని, ఎటువంటి విచారణలకు భయపడమని పేర్కొన్నారు. దిల్లీ ప్రభుత్వం వివిధ రంగాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆపడానికి బీజేపీ ఇటువంటి తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులు ఇస్తోందని మండిపడ్డారు. బీజేపీ నేతలు చేసే ఫిర్యాదులను పట్టించుకోకూడదని, సాధారణ ప్రజల నుంచి అవినీతి ఆరోపణలు వస్తున్నాయా అనే విషయాన్ని గమనించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. గతంలో గవర్నర్గా ఉన్న అనిల్ బైజల్ ఈ ఫిర్యాదును తోసిపుచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా తాత్కాలిక ఆసుపత్రుల కోసం తొలుత రూ.1,216 కోట్లతో టెండర్లు పిలిచి చివరికి దాన్ని రూ.1,256కు ఆమోదించడంలో అవినీతి ఉందని బీజేపీ ఏంపీ మనోజ్ తివారి చేసిన ఆరోపణలపై దిల్లీ ఎల్జీ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే.