ముంబై : సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే అకాడమీ(ఆస్కార్) అవార్డు కోసం భారత్కు చెందిన ఓ డాక్యుమెంటరీ చిత్రం పోటీ పడుతోంది. ఆస్కార్ డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరిలో పోటీపడ్డ డాక్యుమెంటరీలను షార్ట్లిస్ట్ చేయగా.. అందులో ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ చోటు సంపాదించింది. తదుపరి రౌండ్లోనూ ఎంపికైతే ఆస్కార్కు నామినేట్ అయ్యే అవకాశముంది. ఈ ఏడాది జనవరి 30న విడుదలైన ఈ డాక్యుమెంటరీకి దిల్లీకి చెందిన రింటూ థామస్, సుష్మిత్ ఘోష్ దర్శకత్వం వహించారు. సునీతా ప్రజాపతి, మీరా దేవి, శ్యామ్కాళీ దేవి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక దళిత మహిళ నడిపిస్తున్న వార్త పత్రికకు చెందిన మహిళా రిపోర్టర్లు.. పురుషాధిక్యత, కుల వివక్ష ఉన్న సమాజంలో ఏ విధంగా తమ వృత్తిని కొనసాగించారు.. కేవలం పత్రికకే పరిమితం కాకుండా డిజిటల్గానూ రాణించేందుకు ఎంత కష్టపడ్డారో తెలియజేసే విధంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. మొత్తం 138 డాక్యుమెంటరీలు ఈ విభాగంలో పోటీ పడగా.. టాప్ 15 డాక్యుమెంటరీలను షార్ట్లిస్ట్ చేశారు. ‘రైటింగ్ విత్ ఫైర్’తోపాటు అట్టికా, ఫ్లీ, జులియా, ఫయా దాయి, ప్రెసిడెంట్ తదితర డాక్యుమెంటరీలు పోటీలో ఉన్నాయి. మరోవైపు ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో పోటీ పడిన తమిళ చిత్రం ‘కూళంగల్’, పెబ్బల్ ఆస్కార్ బరి నుంచి నిష్క్రబించాయి. పీఎస్ వినోద్రాజ్ దర్శకత్వం వహించిన కూళంగల్ చిత్రం షార్ట్లిస్ట్లో స్థానం దక్కించుకోలేకపోయింది.