చండీగఢ్ : ఫిరోజ్పూర్ జిల్లాలోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు పొలాల్లో పేలుడు పదార్థాలు బయటపడిన వైనంపై పంజాబ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరాకరణ విధానం నుంచి బయటపడాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ముగ్గురు వ్యక్తులను విచారించిన అనంతరం బుధవారం అలీ కే గ్రామంలో బాంబును స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. ‘సరిహద్దు నుంచి క్రమం తప్పకుండా వివిధ రకాల సరకులు పంపబడుతున్నందున, సవాలును ఎదుర్కోవడానికి అదనపు నిఘా వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి’ అని అమరేందర్ అన్నారు. గతంలో కూడా అమరేందర్.. పాకిస్తాన్నుంచి పంజాబ్ ముప్పు పొంచివుందని వ్యాఖ్యానించినప్పుడు.. ‘ఇటు వంటి వ్యాఖ్యలు ప్రజలలో అనవసర భయం, అభద్రతా భావాన్ని సృష్టిస్తాయి’ అని పంజాబ్ డిప్యూటీ ముఖ్యమంత్రి రాంధావా అప్పుడు చెప్పారు. గత కొన్ని నెలలుగా అమృత్సర్ రూరల్, కపుర్తలా, ఫాజిల్కా , తరన్ తరన్లలో కూడా టిఫిన్ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. అమృత్సర్లోని భారత్-పాక్ సరిహద్దులో ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడి)తో నిండిన టిఫిన్ బాక్స్ను స్వాధీనం చేసుకున్న పంజాబ్ పోలీసులు స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఒక పెద్ద ఉగ్రదాడి ప్రయత్నాన్ని విఫలం చేశారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా భారత్ వైపు బాంబులను చేరవేసే అవకాశం ఉందని పోలీసులు అప్పట్లో చెప్పారు.