తోటి ప్రయాణికుల ఫిర్యాదు
న్యూదిల్లీ: రైలు ప్రయాణంలో లోదుస్తుల్లో సంచరించి వివాదంలోకెక్కిన బీహార్లోని పాలక జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్పై తాజాగా మరిన్ని ఆరోపణలు వచ్చాయి. ఘటన సమయంలో ఎమ్మెల్యే మద్యం సేవించి ఉన్నారని, ఆయన ప్రవర్తనను నిలదీసినందుకు తన బంగారు ఆభరణాలను లాక్కొన్నారని తోటి ప్రయాణికుడు ఒకరు దిల్లీలోని రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘‘రైలు బోగీలో నిక్కరు, బనియన్తో అర్ధనగ్నంగా అటు ఇటూ తిరిగిన ఎమ్మెల్యే గోపాల్ మండల్ ఆ సమయంలో తాగేసి ఉన్నారు. ఎందుకిలా ఉన్నారని అడిగినందుకు నా బంగారు ఉంగరం, చెయిన్ లాక్కొన్నారు. నాతో దురుసుగా ప్రవర్తించారు’’ అని ఆ ప్రయాణికుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రయాణికుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాట్నా-దిల్లీ తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్లో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే గోపాల్ లోదుస్తుల్లో రైలు బోగీలో సంచరించిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే ప్రవర్తనతో ఇబ్బందిపడ్డ తోటి ప్రయాణికులు ఆయనను నిలదీశారు. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రైలులో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అధికారులు సర్దిచెప్పి ఎమ్మెల్యేను మరో బోగీలోకి పంపించారు. అయితే రైలు ఎక్కగానే పొట్టలో ఇబ్బందిగా అనిపించడంతో వాష్రూమ్కు వెళ్లే తొందరలో కుర్తా, పైజామా తొలగించానని, ఆ సమయంలో బోగీలో మహిళా ప్రయాణికులెవరూ లేరని ఎమ్మెల్యే ఆ తర్వాత మీడియాతో చెప్పారు