Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎస్పీవి ప్రతీకార రాజకీయాలు

నకిలీ సమాజ్‌వాద్‌, పేదల ప్రభుత్వం మధ్య యూపీలో ఎన్నికలు
వర్చువల్‌ సమావేశంలో మోదీ ఎన్నికల ప్రచారం

న్యూదిల్లీ : అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓటర్లను ప్రేరేపిస్తున్నదని ఎస్పీపై ఎదురుదాడి చేశారు. యూపీలో మార్పు తీసుకురావడానికి తాము ప్రయత్నిస్తుంటూ ప్రతిపక్షం ప్రతీకారం కోరుకుంటుందని ఆరోపించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం అభివృద్ధి విధానాలకు చాలా దూరంగా ఉందని ఎస్‌పీ అంటోందన్నారు. ఈ ఎన్నికలను నకిలీ సమాజ్‌వాద్‌..పేదల ప్రభుత్వం మధ్య ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు. యోగీ ప్రభుత్వం అమలు చేస్తున్న పేదలకు ఇళ్లు, వెనుకబడిన వర్గాలకు పథకాలు, వైద్య కళాశాలలు, ఎక్స్‌ప్రెస్‌వేల ద్వారా కనెక్టివిటీ, ముస్లిం మహిళలకు కార్యక్రమాలు, మహిళలకు సంబంధించి వివిధ పథకాలను మోదీ ఏకరువు పెట్టారు. ఈ రోజుల్లో ప్రజలు చాలా కలలుగంటున్నారని, నిద్రపోయే వారికే ఆ అవకాశమని వ్యాఖ్యానించారు. దీన్ని అఖిలేశ్‌ యాదవ్‌కు ముడిపెడుతూ ఎద్దేవా చేశారు. అఖిలేశ్‌ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని పేర్కొన్నారు. యూపీలో తానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ప్రతి రోజు కలలోకి వచ్చి శ్రీకృష్ణుడు చెప్పాడంటూ అఖిలేశ్‌ యాదవ్‌ అంటున్నారని వ్యాఖ్యానించారు. నోయిడా, గ్రేటర్‌ నోయిడాలోని పట్టణ ప్రాంతాల్లోని గృహాల సమస్యలపై మాట్లాడుతూ అవినీతి కారణంగానే అక్కడ ప్లాట్లను కొనుగోలు చేసిన వేలాది మంది సమస్యల్లో కూరుకున్నారని అన్నారు. అసంపూర్తిగా ఉన్న ప్లాట్లను పూర్తి చేసేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. వచ్చే నెల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తొలి దశలో భాగంగా ఓటింగ్‌ జరిగే ముజఫర్‌నగర్‌, బాగ్‌పట్‌, సహరాన్‌పూర్‌, గౌతమ్‌బుద్ధ నగర్‌ ఓటర్లనుద్దేశించి తొలి వర్చువల్‌ సమావేశాన్ని ప్రధాని మోదీ సోమవారం నిర్వహించారు. యూపీలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ ప్రతిపక్షం ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుందని ఎదురుదాడి చేశారు. అటువంటి వారికే ఈ పార్టీ టికెట్లు ఇస్తోందన్నారు. అందుకు వారి ప్రవర్తనే నిదర్శనమని, నేరస్తులు రాష్ట్రంలో స్నేహపూర్వక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మండిపడ్డారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన కింద ప్రతి కుటుంబాన్ని భారత్‌ ఆదుకుంటుందని, ఈ పథకం ద్వారా 15 కోట్ల మంది ఉచితంగా రేషన్‌ పొందుతున్నారని చెప్పారు. ఇదే యూపీ ఐదేళ్ల క్రితం పేదలకు అందించాల్సిన రేషన్‌ దొంగతనానికి గురైందని, కానీ నేడు పేదలకు చేరుతోందని అన్నారు. గత ఐదేళ్లలో వచ్చిన మార్పు ఇదేనని పేర్కొన్నారు. తాము ఇప్పుడు చిన్న రైతుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, వారి కోసమే పనిచేయడం ప్రారంభించామని, చిన్న రైతుల గ్రామీణ కోణాన్ని మారుస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img