శ్రీనగర్ : కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో దట్టంగా మంచు అలుముకుంది. లోయలో అత్యల్పస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీనగర్లో రికార్డు స్థాయిలో మైనస్ 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం సాధారణ ఉష్ణోగ్రతలు గడ్డకట్టుకునే స్థాయిలో ఉండి, రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గిందని వాతావరణశాఖ తెలిపింది. శ్రీనగర్లో గురువారం రాత్రి మైనస్ 1.4 డిగ్రీలు నమోదు కాగా, అది శనివారం మైనస్ 1.5 డిగ్రీలకు చేరిందని పేర్కొంది. అమర్నాథ్ యాత్రకు బేస్క్యాంప్ అయిన పెహల్గామ్లో మైనస్ 4.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కశ్మీర్లోని బారాముల్లాలో ఉన్న గుల్మార్గ్ రిసార్ట్లో ఉష్ణోగ్రత మైనస్ 1.0 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.