‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై ఒమర్ అబ్దుల్లా ఆందోళన
శ్రీనగర్ : మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా శుక్రవారం ఇటీవల విడుదలయిన బాలీవుడ్ సినిమా ‘ద కశ్మీర్ ఫైల్స్’ను ప్రస్తావిస్తూ, మొత్తం కశ్మీర్పై ద్వేషం కారణంగా దేశమంతటా ఉన్న కశ్మీర్కు చెందిన యువ విద్యార్థులు లక్ష్యం కావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా విద్యార్థిపై దాడి జరిగినా లేదా హాని జరిగినా, దానికి కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. కశ్మీర్ ముస్లింలందరూ ఇతర మతాలకు కట్టుబడి ఉండరనే భావన ఏర్పడుతోంది. 1990లో పుట్టని, కేవలం 20 ఏళ్లలోపు ఉన్న, బయట చదువుతున్న కశ్మీర్ యువ విద్యార్థులపై ఈ ద్వేషం పర్యవసానాలను కలిగిస్తుందని నేను భయపడుతున్నాను. వారు దుర్భలంగా తయారవుతున్నారు’ అని ఎన్సీ సీనియర్ నాయకుడు వలీ మహమ్మద్ ఇటూ వర్ధంతి సందర్భంగా అబ్దుల్లా అన్నారు. లోయలో పెరుగుతున్న ఉగ్రవాదం నేపథ్యంలో కశ్మీరీ పండిట్ల స్థానభ్రంశం గురించి ప్రస్తావించారు. ‘పండిట్లే కాదు, ముస్లింలు, సిక్కులు కూడా (1990ల్లో) చంపబడ్డారు. ముస్లింలు, సిక్కులు కూడా కశ్మీర్ నుండి వలస వచ్చారు. ఇంకా తిరిగి రాలేదు’ అని అబ్దుల్లా పేర్కొన్నారు. ‘ద కశ్మీర్ ఫైల్స్’లో చాలా అబద్ధాలు ఉన్నాయని అన్నారు. ‘అతి పెద్దది ఏమిటంటే, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఉందని తప్పుగా చూపించారు. వాస్తవం ఏమిటంటే, కశ్మీర్ పండిట్లు కశ్మీర్ను విడిచిపెట్టినప్పుడు 1990లో జమ్ము, కశ్మీర్లో గవర్నర్ పాలన ఉంది. అలాగే, కేంద్రంలో బీజేపీ మద్దతుతో కూడిన వీపీ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పారు. జమ్ము, కశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగ పదవిని రద్దు చేయడంపై, ఎన్సీ పోరాటం చేసిందని, ఈ విషయంలో తమ పార్టీ వెనక్కి తగ్గదని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.