చండీగఢ్: మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన రాజ్యసభ సభ్యుడు హర్భజన్సింగ్ కీలక ప్రకటన చేశారు. ఎంపీగా తనకు లభించే వేతనాన్ని రైతుల కుమార్తెల విద్య, సంక్షేమం కోసం వెచ్చిస్తానని తెలిపారు. దేశాభివృద్ధి కోసం తాను చేయాల్సింది చేస్తానని స్పష్టంచేశారు. ఆప్ నుంచి రాజ్యసభకు హర్భజన్సింగ్ గతనెలలో పంజాబ్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ‘రాజ్యసభ సభ్యుడిగా నా వేతనాన్ని రైతుల కుమార్తెల విద్య, సంక్షేమం కోసం వెచ్చించాలని కోరుకుంటున్నాను. దేశాభివృద్ధిలో ఈ విధంగా నేను భాగస్వామిని అవుతాను. ఇందుకోసం ఎంత చేయగలనో అంతా చేస్తాను. జైహింద్’ అని హర్భజన్ శనివారం ట్వీట్ చేశారు. క్రీడలు, క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలపై తాను దృష్టి కేంద్రీకరిస్తానని నామినేషన్ సమయంలో హర్బజన్ చెప్పారు.