Friday, April 26, 2024
Friday, April 26, 2024

నెలాఖరు నుంచి కోవిడ్‌ నిబంధనల ఎత్తివేత

మాస్క్‌లు, భౌతికదూరం తప్పనిసరి: కేంద్రం
న్యూదిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కోవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడిరచింది. అయితే మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని స్పష్టంచేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం సమాచారమిచ్చారు. దేశంలో కోవిడ్‌ విజృంభించడంతో రెండేళ్ల క్రితం వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నిబంధనలను కేంద్రం అమల్లోకి తెచ్చింది. కోవిడ్‌ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్య ఆధారంగా అనేకసార్లు వీటిల్లో మార్పులు, చేర్పులు చేసింది. గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ‘కరోనా పరిస్థితుల్లో మెరుగుదలతో పాటు మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ సామర్థ్యాన్ని పెంచుకొని సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఓ నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ కట్టడికి విపత్తు నిర్వహణ చట్టం కింద ఉన్న నిబంధనలు మరింతకాలం పొడిగించాల్సిన అసవరం లేదని భావిస్తున్నాం. మార్చి 31న ప్రస్తుతమున్న ఆంక్షల గడువు ముగియనుంది. ఆ తర్వాత హోంశాఖ ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేయబోదు’ అని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్రాలకు పంపిన ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రజలంతా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హోంశాఖ సూచించింది. కేసుల సంఖ్య పెరిగితే..స్థానిక ప్రభుత్వాలు తిరిగి నిబంధనలు విధించే అంశాన్ని పరిశీలించవచ్చని భల్లా చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img