ఒమిక్రాన్ ప్రకంపనల నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది..కొత్త వేరియంట్ వేళ రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్పై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. పండుగల సందర్భంగా ఆంక్షలు విధించాలని సూచించారు. భారీ సభలు, సమూహాలను నియంత్రించాలని ఆదేశించారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముప్పు రాకముందే ఆంక్షలు అమలు చేయాలని అన్నారు. అ ఆంక్షలు 14 రోజులు అమల్లో ఉండేలా చూడాలన్నారు. పండగల వేళ ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేలా రాత్రి కర్ఫ్యూలను అమలుచేయాలని ఆదేశించారు. బాధితుల నమూనాలను ఆలస్యం చేయకుండా జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించాలన్నారు. వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేయాలని, జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్ రేటు ఉన్న జిల్లాల్లో ఇంటింటి టీకా పంపిణీ కార్యక్రమాన్ని మమ్మరం చేయాలని ఆదేశించారు.