న్యూదిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తిమంతులైన మహిళల జాబితాలో వరుసగా మూడోసారి స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆమె మరింత మెరుగైన స్థానంలో నిలిచారు. గతేడాది ఆమె ఈ జాబితాలో 41వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 37వ స్థానాన్ని దక్కించుకున్నారు. అమెరికా ఆర్థికమంత్రి జానెట్ యెల్లెన్ కన్నా రెండు స్థానాలు ముందంజలో ఉండటం మరో విశేషం. మనదేశ తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్ ఈ జాబితాలో 2019లో 34వ స్థానంలోనూ, 2020లో 41వ స్థానంలోనూ, 2021లో 37వ స్థానంలోనూ నిలిచారు. అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఏటా ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తిమంతులైన మహిళల జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో 40 మంది సీఈఓలు ఉన్నారు. వీరు 3.3 ట్రిలియన్ల డాలర్ల రెవెన్యూను పర్యవేక్షిస్తున్నట్లు ఈ పత్రిక తెలిపింది. ప్రపంచంలో 19 మంది మహిళా నేతలు, ఓ ఇమ్యునాలజిస్ట్ ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. దాతృత్వం గల మహిళ మెకెంజీ స్కాట్ ఈ జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రెండోస్థానాన్ని, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టిన్ లగార్డే మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల్లో హెచ్సీఎల్ కార్పొరేషన్ సీఈఓ రోషిణి నాడార్ మల్హోత్రా, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల్లో ఒకరుగా ఈ జాబితాలో గుర్తింపు పొందారు.