భారత్, చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీనరేఖ వద్ద నిర్మాణ పనుల్లో ఉన్న 19 మంది వలస కూలీలు అదృశ్యం అయ్యారు. వీరి ఆచూకి రెండు వారాలుగా తెలియడం లేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వీరిలో ఒకరి మృతదేహం సమీపంలోని నదిలో లభ్యమైనట్లు కథనాలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే,అరుణాచల్ ప్రదేశ్లోని కురుంగ్ కుమే జిల్లాలో దామిన్ సర్కిల్ వద్ద బోర్డర్ రోడ్డు పనిలో నిమగ్నమైన వలస కూలీలు రెండు వారాల క్రితం కనిపించకుండాపోయారు. రాజధాని ఇటానగర్కు 300 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఆచూకీ లేని కార్మికుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖకు సమీపంలోనే వారు అదృశ్యమయ్యారు. అయితే కుమే నదిలో ఒకరి మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 19 మంది కూలీలు అసోం నుంచి వలస వచ్చినట్లు కాంట్రాక్టర్ తెలిపారు. ఈద్ పండుగ సెలబ్రేట్ చేసుకునేందుకు ఆ కాంట్రాక్టర్ వారికి లీవ్ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఈ నెల 5వ తేదీన ఈ కూలీలంతా
తమ శిబిరాల నుంచి పారిపోయారు. నాటి నుంచి వీరు కన్పించకుండా పోయినట్లు తెలుస్తుంది. వీరంతా కనిపించకుండా పోయనట్లు జూలై 13వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్లో కంట్రాక్టర్ ఫిర్యాదు ఇచ్చారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిర్మాణ సైట్ నుంచి వీరంతా అడవి మార్గంలో కాలినడకన వెళ్లి ఉంటారని, ఈ క్రమంలో దారితప్పి అడవిలో అదృశ్యమై ఉంటారని పోలీసులు భావించారు. అయితే దమిన్ ప్రాంతంలోని కుమే నదిలో ఇటీవల ఓ మృతదేహం లభ్యమైంది. అది అదృశ్యమైన కూలీలలో ఒకరిదంటూ సోషల్మీడియా, స్థానిక మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. పారిపోతున్న క్రమంలో కూలీలంతా ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా కథనాలపై కురంగ్ కుమే జిల్లా డిప్యూటీ కమిషనర్ నీఘే బెంగియా స్పందించారు. వస్తున్న కథనాలపై నిజానిజాలు తెలుసుకునేందుకు ఘటనా స్థలానికి సీనియర్ అధికారులను పంపినట్లు తెలిపారు. కూలీల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టామన్నారు.