రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ దేశవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. లోక్ సభ, రాజ్యసభ, శాసనసభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.ఈ సందర్భంగా ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రపతి ఎన్నికలు అత్యంత కీలకమైనవని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడంలో కీలక పాత్ర పోషించనున్నాయని పేర్కొన్నారు.రాష్ట్రపతి ఎన్నికల్లో డబ్బులు ఎరగా వేశారని, ప్రలోభాలకు తెరలేపారని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ విప్లు పని చేయవని…. ప్రజా ప్రతినిధులు విచక్షణతో ఓటు వేయాలని కోరారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను ప్రజాస్వామ్య విరుద్ధంగా కూల్చి వేశారని దుయ్యబట్టారు. తాను కేవలం రాజకీయ యుద్ధంలోనే కాకుండా, ప్రభుత్వ ఏజెన్సీలపై కూడా పోరాడుతున్నానని చెప్పారు. ప్రభుత్వ ఏజెన్సీలు చాలా శక్తి వంతంగా తయారయ్యాయని… అవి పార్టీలను కూడా చీల్చుతున్నాయని విమర్శించారు.