మొత్తంగా 12 గంటల పాటు సాగిన విచారణ
మూడు రోజుల పాటు సోనియాను విచారించిన ఈడీ
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం కూడా విచారించారు. అయితే మంగళవారం మాదిరిగా కాకుండా బుధవారం మధ్యాహ్నానికే ఆమె విచారణను ముగించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులకు సంబంధించిన కేసులో సోనియాతో పాటు రాహుల్ గాంధీని కూడా ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాహుల్ గాంధీ విచారణ ముగియగా… తాజాగా సోనియాను అధికారులు విచారిస్తున్నారు.ఈ నెల 21న తొలిసారి ఈడీ విచారణకు హాజరైన సోనియా గాంధీని మంగళవారం కూడా విచారణకు పిలిపించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆమెను అధికారులు ఏకంగా 6 గంటల పాటు విచారించారు. ఈ నెల 21న 3 గంటల పాటు ఈడీ అధికారులు ఆమెను విచారించారు. ఇలా మొత్తంగా మూడు రోజుల పాటు ఆమెను 12 గంటల పాటు అధికారులు విచారించారు. బుధవారంతోనే సోనియా విచారణను ఈడీ అధికారులు ముగిస్తారా? లేదంటే మళ్లీ ఆమెను విచారణకు పిలుస్తారా? అన్నది తేలియాల్సి ఉంది.