న్యూదిల్లీ: మిత్రులకు దేశాన్ని దోచిపెడుతున్న ప్రధాని నరేంద్రమోదీ…యువతను మాత్రం నిరుద్యోగులుగా మార్చివేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ విమర్శించారు. విదేశాల్లో సైతం తన మిత్రుల భవిష్యత్కు భద్రత కల్పిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర పారామిలిటరీ బలగాలకు సంబంధించిన సిబ్బంది నియామకం కోసం పరీక్షలు రాసి..ఇంకా చేతికి నియామక పత్రాలు రాక రోడ్లపై తిరుగుతున్న యువతీ, యువకుల వీడియోలను రాహుల్ షేర్ చేశారు. ఇద్దరు, ముగ్గురు తన సంపన్న మిత్రుల కోసం దేశాన్ని కట్టబెట్టడమే కాకుండా విదేశాల్లో సైతం భద్రత కల్పిస్తున్న మోదీ…సొంత దేశంలోని యువతను నిరుద్యోగులుగా ఉంచుతున్నారని రాహుల్గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. సైన్యంలో చేరాలనుకునే యువత 2018లోనే పరీక్షలు రాసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. సైన్యంలో నియామకాల కోసం ఏడాదిన్నరగా ఆందోళనలు చేస్తున్నారు. నాగపూర్ నుంచి దిల్లీ వరకు భారీ ప్రదర్శన చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ పోస్టు చేశారు.