కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. పోటీ పడిన ఇద్దరు అభ్యర్దుల్లో శశిథరూర్ పై మల్లిఖార్జున ఖర్గే దాదాపు 8వేల ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. అదే సమయంలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా శశిథరూర్ యూపీలో జరిగిన పోలింగ్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపించారు. ఇదే విషయంపై ఆయన ప్రచార బృందం తరఫున ఏజెంట్ సల్మాన్ సోజ్.. పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ మథుసూథన్ మిస్త్రీకి ఫిర్యాదు చేసారు. అంతవరకూ బాగానే ఉన్నా ఈ వ్యవహారాన్ని మీడియాకు లీక్ చేశారు. సల్మాన్ సోజ్ మథుసూధన్ మిస్త్రీకి రాసిన ఫిర్యాదు లేఖ మీడియాలో హల్ చల్ చేసింది. దీన్ని వాడుకుంటూ బీజేపీ విమర్శలు మొదలుపెట్టేసింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ సోషల్ మీడియా వింగ్ కూడా ట్వీట్లు పెట్టింది. దీంతో పారదర్శకంగా వ్యవస్ధాగత ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. దీనిపై స్పందించిన థరూర్.. సారీ లెటర్ లీకైంది.. వదిలేయండి అన్నారు. కానీ శశిథరూర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ ఇవాళ తీవ్రంగా స్పందించారు. శశిధరూర్ టీమ్ తనకు రాసిన లేఖపై స్పందించిన మిస్త్రీ.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ మీరు చేసిన ఫిర్యాదును నమోదుచేసుకున్నామని, కానీ మీరు మీడియాకెక్కారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘మా సమాధానాలన్నిటితో మీరు సంతృప్తి చెందారని భావిస్తున్నట్లు చెప్పిన మిస్త్రీ..మీరు మాదగ్గర ఒకలా, మీడియాలో మరోలా వ్యవహరించారని చెప్పేందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. తాము మీ ఫిర్యాదు అంగీకరించినా మీరు కేంద్ర ఎన్నికల అథారిటీ మీపై కుట్ర పన్నిందని ఆరోపిస్తూ మీడియా ముందుకొచ్చారని మిస్త్రీ తన సమాధానంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.