బాలాసోర్ (ఒడిశా) : ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను చేధించే సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్ని భారత్ వరుసగా రెండో రోజు గురువారం విజయవంతంగా పరీక్షించింది. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు జరిపిన ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరం ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగించిన ప్రళయ్.. అన్ని లక్ష్యాలను సమర్థంగా ఛేదించిందని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అధికారులు పేర్కొన్నారు. అభివృద్ధిపరుస్తున్న ఓ క్షిపణిని రెండు వరుస రోజుల్లో విజయవంతంగా పరీక్షించడం ఇదే మొదటిసారని వారు చెప్పారు. కాగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. అదేవిధంగా 500 కేజీల నుంచి 1000 కేజీల వరకు బరువును మోసుకెళ్లగల సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. ప్రళయ్ క్షిపణి ఘన ఇంధనంతో పనిచేస్తుంది. ఇండియన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్లో భాగంగా రూపొందించిన పృథ్వి డిఫెన్స్ వెహికిల్ను ఆధారంగా చేసుకుని ఈ ప్రళయ్ క్షిపణిని రూపొందించారు. క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్డీవో బృందాన్ని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, డీఆర్డీఓ చైర్మన్ జి.సతీశ్రెడ్డి అభినందించారు.