Friday, April 26, 2024
Friday, April 26, 2024

విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు సీపీఐ నేత నారాయణ లేఖ

న్యూదిల్లీ : తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా బాసరలో ఉన్న ట్రిపుల్‌ ఐటీలో నెలకొన్న సమస్యల పరిష్కారం విషయంలో చొరవ చూపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు ఆదివారం లేఖ రాశారు. విద్యాలయం అధికారులు విద్యార్థులపై ఎటువంటి

వేధింపులకు పాల్పడుతున్నారో ఆ లేఖలో వివరించారు. బాసరలోని యూనివర్సిటీకి ఇప్పటికీ శాశ్వత ఉపకులపతి లేరనీ, ఇది చాలా విచారించాల్సిన అంశమని పేర్కొన్నారు. తక్షణమే ఉపకులపతిని నియమించాలని డిమాండ్‌ చేశారు. వర్సిటీలోని వసతి గృహాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి నడిపిస్తున్నారని, వారు హాస్టల్స్‌ను నిర్వహించే తీరు దారుణంగా ఉందని తెలిపారు. ఆరు వేల మంది ఉంటున్న వర్సిటీ హాస్టల్స్‌లో నాసిరకం ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారని తెలిపారు. హాస్టళ్లను వర్సిటీ యాజమాన్యమే నిర్వహించాలని ఎంతో కాలంగా విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. రెండు వారాల క్రితం కలుషిత ఆహారం తీసుకున్న 600 మంది విద్యార్థులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారని, వారిలో చాలా మంది ఆసుపత్రిపాలయ్యారని తెలిపారు. వర్సిటీలో 200కి పైగా అధ్యాపక పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయని, దీంతో బోధనపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు.
ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం సహా లైబ్రరీలో సౌకర్యాలను మెరుగుపర్చాల్సి ఉందని పేర్కొన్నారు. విద్యార్థులకు యాజమాన్యం యూనిఫారాలు, క్రీడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం విద్యార్థులు సమావేశమైన తరుణంలో వారిపై నిర్భంధాన్ని విధించి వారి నోరు నొక్కే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. క్యాంపస్‌కు తాళం వేసి పోలీసులను మోహరించి అప్రజాస్వామికంగా వర్సిటీని కాన్సంట్రేషన్‌ క్యాంపుగా మార్చారని తెలిపారు. ఇప్పటికైనా విద్యార్థుల న్యాయమైన సమస్యలను గుర్తించి అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించాలని కోరుతున్నట్టు ఆ లేఖలో నారాయణ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img